రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు.
ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.
వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు.
ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.
50 హాఫ్ సెంచరీస్
ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్స్కోరర్గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.


