source: BAI X
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్ అదరగొడుతోంది. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో జపాన్కు చెందిన ఏడో సీడ్ రిన్ ఇవానాగా-కీ నకనిషి జోడీని వరుస గేముల్లో ఓడించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో పతకానికి భారత్ మరో అడుగు దూరంలో నిలిచింది.
అన్సీడెడ్గా బరిలోకి దిగిన ట్రీసా-గాయత్రీ జోడీ.. ప్రపంచ 7వ ర్యాంక్లో ఉన్న జపాన్ జోడీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం 41 నిమిషాల్లోనే 21-16, 21-12తో ప్రత్యర్థులను చిత్తు చేసింది. తొలి గేమ్లో ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించిన భారత జోడీ.. రెండో గేమ్లో మరింత దూకుడుగా ఆడి మ్యాచ్ను సొంతం చేసుకుంది.
పీవీ సింధు ముందంజ
ఇదే టోర్నీలో భారత మహిళల సింగిల్స్ స్టార్ పీవీ సింధు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ 49వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ వెన్ యు జాంగ్తో 35 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో 21–16, 21–17తో గెలిచింది. ఇవాళ జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్లో భారత్కే చెందిన ఉన్నతి హుడా రెండో రౌండ్లోనే వెనుదిరిగింది.
ప్రిక్వార్టర్స్లో ఆయుశ్ శెట్టి
పురుషుల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో ఆయుశ్ శెట్టి కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–10తో దుమిందు అబేవిక్రమ (శ్రీలంక)పై గెలుపొందాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో ఆయుశ్ తలపడతాడు. పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న భారత నంబర్వన్, ప్రపంచ 11వ ర్యాంకర్ లక్ష్య సేన్ అనూహ్య పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.


