
కొలంబో: శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులో భారీ స్కోర్లు చేసిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్లో అదే జోరు కనబర్చలేకపోయింది. బుధవారం కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్... తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులు చేసింది.
ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్ (93 బంతుల్లో 46; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ముషి్ఫకర్ రహీమ్ (75 బంతుల్లో 35; 5 ఫోర్లు), లిటన్ దాస్ (56 బంతుల్లో 34; 3 ఫోర్లు), మెహదీ హసన్ మిరాజ్ (42 బంతుల్లో 31; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. వీరంతా మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. క్లిష్టతరమైన పిచ్పై పరుగులు రాబట్టేందుకు తడబడుతూ లంక బౌలర్లకు వికెట్లు అప్పగించుకున్నారు.
గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీలతో ఆకట్టుకున్న బంగ్లా కెపె్టన్ నజు్మల్ హసన్ షంటో (8) విఫలం కాగా... మరో ఓపెనర్ అనాముల్ హక్ (0) డకౌటయ్యాడు. తైజుల్ ఇస్లామ్ (9 బ్యాటింగ్), ఇబాదత్ హుసేన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో అరంగేట్ర స్పిన్నర్ సోనాల్ దినుశా, అషిత ఫెర్నాండో, విశ్వ ఫెర్నాండో రెండేసి వికెట్లు పడగొట్టారు. గత మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఏంజెలో మాథ్యూస్ స్థానంలో సోనాల్ దినుశా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య గాలె వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన విషయం తెలిసిందే.