గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకే ఇష్టపడతాడు: రోహిత్‌ శర్మ | Rohit Sharma Said Shubman Gill Prefers To Bat At 3, He Feels He Can Do Well Batting At That Position | Sakshi
Sakshi News home page

గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకే ఇష్టపడతాడు: రోహిత్‌ శర్మ

Jan 2 2024 7:21 PM | Updated on Jan 2 2024 7:49 PM

Rohit Sharma Said Shubman Gill Prefers To Bat At 3, He Feels He Can Do Well Batting At That Position - Sakshi

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ను టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెనకేసుకొచ్చాడు. గిల్‌ మూడో స్థానంలో  బ్యాటింగ్‌కు దిగడాన్ని హిట్‌మ్యాన్‌ సమర్ధించాడు. బ్యాటింగ్‌ మార్పు అంశంపై రోహిత్‌ గిల్‌కు మద్దతుగా నిలిచాడు.

ఓపెనింగ్‌కు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి పెద్ద తేడా ఏమీ లేదని, రెండు స్థానాల మధ్య కేవలం ఒక్క బంతి మాత్రమే వ్యతాసముంటుందని అన్నాడు. గిల్‌ను ఓపెనింగ్‌ కాదని వన్‌డౌన్‌లో దింపడంపై విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌ ఇలా స్పందించాడు. 

వాస్తవానికి గిల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకే ఇష్టపడతాడు. అతను ఆ స్థానంలో బరిలోకి దిగితే సత్ఫలితాలు సాధిస్తాడని నమ్ముతాడు. గిల్‌ చాలా తెలివైన వాడు. అతను పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్‌ను మార్చుకోగల సమర్ధుడని కితాబునిచ్చాడు. కొత్త పాత్రలో గిల్‌ త్వరలోనే లయను అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. గిల్‌కు రంజీల్లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసిన అనుభవం​ కూడా ఉందని గుర్తు చేశాడు.

నా వరకైతే నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడను. నేను ఓపెనర్‌గానే కంఫర్ట్‌గా ఉంటానని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. రెండో టెస్ట్‌కు ముందు మీడియా సమావేశంలో హిట్‌మ్యాన్‌ ఈ విషయాలను షేర్‌ చేసుకున్నాడు.

కాగా, గతేడాది అన్ని ఫార్మాట్లలో సత్తా చాటిన గిల్‌ టెస్ట్‌ల్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు అతన్ని లయ తప్పేలా చేసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే గిల్‌ ఇష్టపూర్వకంగానే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారాడని తాజాగా రోహిత్‌ చెప్పాడు. టెస్ట్‌ల్లో యశస్వి జైస్వాల్‌ కోసం గిల్‌ తన ఓపెనింగ్‌ స్థానాన్ని త్యాగం చేసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ తొలి టెస్ట్‌ ఓడిపోయి 0-1తో సిరీస్‌లో వెనుకపడింది. రేపటి నుంచి ప్రారంభంకాబోయే కీలకమైన రెండో టెస్ట్‌ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement