అదరగొట్టిన దీపక్‌ హుడా

Punjab Set Target Of 154 Runs Against CSK - Sakshi

అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో పంజాబ్‌ బ్యాటింగ్‌కు దిగింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్‌(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లో అగర్వాల్‌ బౌల్డ్‌ అయ్యాడు. కాసేపటికి రాహుల్‌(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా పెవిలియన్‌ చేరాడు. ఎన్‌గిడి బౌలింగ్‌లోనే రాహుల్‌ క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. ఇక క్రిస్‌ గేల్‌(12), పూరన్‌(2), మన్‌దీప్‌ సింగ్‌(14), నీషమ్‌(2)లు నిరాశపరచడంతో పంజాబ్‌ కష్టాల్లో పడింది. కానీ దీపక్‌ హుడా(62 నాటౌట్‌; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కింగ్స్‌ పంజాబ్‌ తేరుకుంది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజాలు తలో వికెట్‌ సాధించారు.

దీపక్‌ హుడా మెరుపులు..
పంజాబ్‌ టాపార్డర్‌ నుంచి పెద్దగా మెరుపులు లేని సమయంలో హుడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడమే కాకుండా షాట్ల ఎంపికలో నియంత్రణ పాటించాడు. ఏ గ్యాప్‌ల్లోకి ఆడితే పరుగులు సాధించవచ్చో చూసుకుంటూ షాట్లు ఆడాడు. పంజాబ్‌ శిబిరంలో ఆందోళన నెలకొన్న సమయంలో హుడా తన ఇన్నింగ్స్‌తో మెరిపించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్‌లో హుడాకు రెండో హాఫ్‌ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో సాధించిన 62 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. ఇది పోరాడే స్కోరు కాబట్టి కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లు ఎంతవరకూ రాణిస్తారో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top