
త్వరలో మహారాష్ట్ర తరఫున దేశవాళీ బరిలోకి!
ఎన్ఓసీ జారీ చేసిన ఎంసీఏ
ముంబై: భారత క్రికెట్లో మెరుపులా వచ్చివెళ్లిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాజాగా ముంబై జట్టును వీడాడు. ఈ మేరకు మరో జట్టుతో ఆడేందుకు వీలుగా తనకు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాల్సిందిగా ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ)ను అభ్యర్థించాడు. అతని క్రికెట్ భవిష్యత్తు కోసం పృథ్వీ షా అభ్యర్థనను మన్నించిన ముంబై సంఘం ఎన్ఓసీ జారీ చేసింది. ఇదివరకే మహారాష్ట్ర సంఘంతో సంప్రదింపులు జరిపిన అతను ఈ సీజన్లో మహారాష్ట్ర క్రికెట్ జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగనున్నాడు. అంతర్జాతీయ కెరీర్లో టీమిండియా తరఫున ఐదు టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు.
చివరిసారిగా ముంబై తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ మాత్రమే ఆడాడు. అందులోనూ పెద్దగా మెరుపుల్లేకపోవడంతో ఎంసీఏ అతన్ని పూర్తిగా పక్కనబెట్టేసింది. అలా ఓ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోయిన తర్వాత కళ్లు తెరిచిన పృథ్వీ షా ఈ సీజన్లో ముంబై తరఫున అవకాశం రాదని గుర్తించాడు. దీంతో మరో జట్టును సంప్రదించిన మీదట ఎన్ఓసీ కోసం ముంబై సంఘాన్ని కోరాడు. ఈ సందర్భంగా ఎంసీఏ కూడా హుందాగా వ్యవహరించి అతను తమ దేశవాళీ జట్టుకు అందించిన సేవల్ని కొనియాడింది. ఎంసీఏ కార్యదర్శి అభయ్ హదప్ యువ క్రికెటర్ భవిష్యత్తులో రాణించాలని అభిలషించారు. దీనికి ప్రతిగా పృథ్వీ కూడా కృతజ్ఞత చాటుకున్నాడు. తనకెన్నో అవకాశాలచ్చిన ముంబై ద్వారానే నేను క్రికెట్కు పరిచయమయ్యానని చెప్పుకొచ్చాడు.
ఏడాదిగా... ఖాళీగా...
క్రికెట్లోకి వచ్చీరాగానే యువ కెరటంగా మారిన పృథ్వీ షా దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ సహా పలువురి మన్ననలు పొందాడు. ఎంత వేగంగా వెలిగాడో... కానీ ఆటపై కొరవడిన ఆసక్తి, ఫామ్పై అలసత్వం, క్రమశిక్షణ రాహిత్యం, ఫిట్నెస్ సమస్యలతో అంతే వేగంగా కుంగాడు. మొదట టీమిండియాకు ఎప్పుడో దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్కు భారమయ్యాడు. తాజాగా సొంత జట్టు ముంబైకి అవసరం లేకుండా పోయాడు. క్రమంగా ఏ జట్టు అక్కున చేర్చుకోలేకపోవడంతో పూర్తిగా ఏడాదికిపైగానే ఖాళీగా ఉంటున్నాడు. మితీమీరిన శరీర బరువుతో సతమతమవుతున్న పృథ్వీ షా ముంబై జట్టులో స్థానం కోల్పోయాక... ఇప్పుడు మహారాష్ట్ర పంచన చేరేందుకు సిద్ధమయ్యాడు.