టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డు | Niroshan Dickwella Continues as Active cricketer with most runs in test cricket without a century | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డు

Aug 17 2026 4:25 PM | Updated on Aug 17 2026 4:28 PM

Niroshan Dickwella Continues as Active cricketer with most runs in test cricket without a century

source: X

శ్రీలంక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ నిరోషన్‌ డిక్వెల్లా టెస్ట్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే కెరీర్‌ను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 55 టెస్ట్‌లు ఆడిన అతడు.. 23 అర్ద సెంచరీల సాయంతో 2837 పరుగులు చేసి జట్టులో కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌) డిక్వెల్లా మరోసారి సెంచరీకి చేరువలో ఔట్‌ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఏ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఇన్ని మ్యాచ్‌లు ఆడి సెంచరీ లేకుండా మనుగడ సాగించలేదు. డిక్వెల్లాకు మాత్రమే ఇది సాధ్యమైంది.

సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ (3154) పేరిట ఉన్నప్పటికీ.. అతడు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ కాదు. అతడు తన అత్యుత్తమ లెగ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు తోడుగా ఈ పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు సంబంధించి వార్న్‌ తర్వాతి స్థానంలోనే డిక్వెల్లా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డిక్వెల్లా చలామణి అవుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మిచెల్‌ స్టార్క్‌ (106 టెస్ట్‌ల్లో (2497) ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. డిక్వెల్లా సెంచరీ చేయకుండానే ఔటైనప్పటికీ శ్రీలంక పరువు కాపాడాడు. సోనల్‌ దినుషాతో (86 నాటౌట్‌) కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. 

90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను డిక్వెల్లా-దినుషా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రతిఘటించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.

ప్రస్తుతం దినుషాకు జతగా ప్రభాత్‌ జయసూర్య (0) క్రీజ్‌లో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 212 పరుగులు వెనుకపడి ఉంది. 

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (167) భారీ శతకంతో సత్తా చాటాడు. కేఎల్‌ రాహుల్‌ (82), ధృవ్‌ జురెల్‌ (51) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత్‌ శ్రీలంకలో పర్యటిస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement