ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్కు నాణ్యమైన స్పిన్నర్లను అందించే దేశంగా మంచి పేరుంది. ఈ దేశానికి చెందిన చాలామంది స్పిన్నర్లు (రషీద్ ఖాన్, ముజీబ్ రహ్మాన్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్ తదితరులు) విశ్వవ్యాప్తంగా మంచి పేరు గడించారు. స్పిన్నర్ల అడ్డా అయిన ఇలాంటి దేశం నుండి తాజాగా ఓ యువ పేసర్ వెలుగులోకి వచ్చాడు.
తన కెరీర్లో రెండో టెస్ట్ మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అది కూడా టీమిండియా లాంటి పటిష్ట జట్టుపై. మరి ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్పై. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరనుకుంటున్నారా..?
అతడి పేరు మొహమ్మద్ సలీమ్ సఫీ. ఈ 23 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేస్ బౌలర్, ప్రస్తుతం ముల్లాన్పూర్ వేదికగా భారత్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న వేల, సఫీ ఒక్కడే ఆఫ్ఘన్ల పాలిట ఆశాకిరణంగా నిలిచాడు.
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగి ఆడగా, సఫీ కీలక సమయాల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా.. ఇందులో 6 వికెట్లు సఫీ ఒక్కడే తీశాడంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో ఇట్టే అర్దమవుతుంది.
సఫీ బౌలింగ్లో ఔటైన భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, ధృవ్ జురెల్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నారు.
సఫీ నేపథ్యం
స్వింగ్ బౌలింగ్లో నైపుణ్యం కలిగిన సఫీ బంతిని రెండు వైపులా కదిలించే సామర్థ్యం కలిగిన పేసర్. లైన్ అండ్ లెంగ్త్లో స్థిరత్వం లేకపోయినా, రిథమ్లోకి వస్తే మాత్రం బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టగలడు. ఆఫ్ఘన్ తరఫున రెండో టెస్ట్ ఆడుతున్న సఫీ.. 2 వన్డేలు, ఓ టీ20 కూడా ఆడాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేయగా.. అనంతరం బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ 28 పరుగుల వద్ద ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (16) వికెట్ తీసి భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు.
అనంతరం 40 పరుగుల వద్ద ప్రసిద్ద్ కృష్ణ మరో ఓపెనర్ సెదిఖుల్లా అటల్ను (17) క్లీన్ బౌల్డ్ చేసి ఆఫ్ఘన్ను కష్టాల్లోకి నెట్టాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 524 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (100), శుభ్మన్ గిల్ (126) సెంచరీలతో కదంతొక్కగా.. సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.


