ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌..! | Jasprit Bumrah Is Likely To Miss The 2nd Test Vs England At Edgbaston Due To Workload Management Says Reports | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌..!

Jun 26 2025 7:02 PM | Updated on Jun 26 2025 8:04 PM

Jasprit Bumrah Is Likely To Miss The 2nd Test Vs England At Edgbaston Due To Workload Management Says Reports

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్‌ వేదికగా రెండో టెస్ట్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్‌ టెస్ట్‌లో 44 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్‌లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్‌లో బరిలోకి దించే అవకాశం ఉంది. 

ఈ సిరీస్‌ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్‌ లోడ్‌ కారణంగా స్టార్‌ పేసర్‌ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.

తొలి టెస్ట్‌కు, రెండో టెస్ట్‌కు మధ్య 8 రోజుల గ్యాప్‌ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్‌ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్‌లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. 

బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్‌లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.

రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే సిరాజ్‌ భారత పేస్‌ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్‌ కోల్పోయి సిరీస్‌లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్‌లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. 

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్‌ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.

ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్‌ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్‌దీప్‌, అర్షదీప్‌ సింగ్‌ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. 

తొలి టెస్ట్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్‌ ఠాకూర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్‌ విభాగం​లో భారత్‌ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.

పూర్తి లైనప్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో సాయి సుదర్శన్‌, కరుణ్‌ నాయర్‌ విఫలమైన వారికి మరో ఛాన్స్‌ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్‌ రెండో టెస్ట్‌ కోసం​ జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్‌ జో​ఫ్రా ఆర్చర్‌ నాలుగేళ్ల తర్వాత టెస్ట్‌ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement