IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్‌ కిషన్‌ సరికొత్త రికార్డు

IPL Mega Auction 2022: Ishan Kishan Emerges 2nd Costliest Indian Player History - Sakshi

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ​క్యాష్‌ రిచ్‌ లీగ్‌ వేలం చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. కాగా ఫిబ్రవరి 12న బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ఇషాన్‌ కిషన్‌ను సొంతం చేసుకుంది. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై వేలంలో 15.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం విశేషం. కాగా ఇషాన్‌ కనీస ధర 2 కోట్లు కాగా ముంబై, హైదరాబాద్‌ పోటీ పడ్డాయి.

ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన ఇషాన్‌ కిషన్‌... ‘‘అందరికి నమస్కారం. ముంబై ఇండియన్స్‌తో మళ్లీ చేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. జట్టులోని ప్రతి ఒక్కరు నన్ను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. నిజంగా నా జట్టుతో తిరిగి కలవడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది’’ అంటూ ఉత్సాహంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లలో యువరాజ్‌ సింగ్‌ ముందు వరుసలో ఉన్నాడు. 
(చదవండి: అప్పుడు రూ.20 ల‌క్ష‌లు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హ‌ర్ష‌ల్‌!)

2008లో ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిని 16 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు రికార్డు ధర పలికిన ఇషాన్‌ యువీ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. మరో టీమిండియా ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను 12.25 కోట్లు పెట్టి కోల్‌కతా కొనుగోలు చేసింది. ఇక విదేశీ ఆటగాళ్లలో క్రిస్‌ మోరిస్‌(16 కోట్లు), ప్యాట్‌ కమిన్స్‌(15.5 కోట్లు), కైలీ జెమీషన్‌(15 కోట్లు) తదితరులు గతంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా గుర్తింపు పొందారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top