వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్‌ | IPL 2026: PBKS Captain Shreyas Iyer Comments After win against DC | Sakshi
Sakshi News home page

వాళ్లు కొట్టినప్పుడు, మేమూ కొడతామనుకున్నా: శ్రేయస్‌

Apr 26 2026 9:51 AM | Updated on Apr 26 2026 10:58 AM

IPL 2026: PBKS Captain Shreyas Iyer Comments After win against DC

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 25) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 265 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ మరో ఏడు బంతులు మిగిలుండగానే సునాయాసంగా ఊదేసింది. ఈ గెలుపు అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ సారధి శ్రేయస్‌ అయ్యర్‌ సంతోషం వ్యక్తం​ చేశాడు. ఈ విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందని అన్నాడు. శ్రేయస్‌ మాటల్లో..

నిజంగా చెప్పాలంటే, మాటలు రావడం లేదు. మైదానంలో తీవ్ర ఎండ, మరోవైపు బౌలర్లు వరుసగా బౌండరీలు, సిక్సర్లు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మాకు తెలుసు.

పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని ముందుగా భావించినప్పటికీ, ఆశించినంత మలుపు లభించలేదు. చహల్‌ బౌలింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రమే బంతి కొద్దిగా ఆగినట్లు అనిపించింది.కేఎల్‌ రాహుల్‌ ఆడిన తీరు అద్భుతం. అతని షాట్లు కళ్లకు పండుగలా అనిపించాయి. అతను ఎలాంటి ఒత్తిడిలోనూ లేనట్లు కనిపించాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించే ముందు నా ఆలోచన ఒక్కటే. వాళ్లు ఎంత చేసినా, మనం ఒక్క పరుగు ఎక్కువ చేయాలి. వాళ్లు కొట్టగలిగినప్పుడు, మేమూ కొడతామనుకున్నా. ఆ సమయంలో అదే నా మైండ్‌సెట్.

డ్రెస్సింగ్‌రూమ్‌లో కూడా ఇదే చర్చ జరిగింది. గత మ్యాచ్‌ల్లో 220కి పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన అనుభవం మాకు ధైర్యాన్నిచ్చింది.

ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాంశ్‌ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడి బలమైన పునాది వేశారు. వారి ఆరంభాన్ని మిగతా బ్యాటర్లు కొనసాగించారు.

బౌలింగ్, ఫీల్డింగ్ విషయాల్లో ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించిన అయ్యర్, ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నాడు.

కాగా, చారిత్రక గెలుపు తర్వాత పంజాబ్‌ను చూసి మిగతా జట్లంతా వణికిపోతున్నాయి. వీరికి ఎంత లక్ష్యమైతే సరిపోతుందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సీజన్‌లో పంజాబ్‌ మునుపెన్నడూ లేనంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. 

వరుస విజయాలతో దూసుకుపోతే ఏకైక అజేయ జట్టుగా చలామణి అవుతుంది. మున్ముందు కూడా పంజాబ్‌ ఇదే జోరును కొనసాగిస్తే, ఈసారి టైటిల్‌ గెలవకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. గత సీజన్‌లో ఇదే శ్రేయస్‌ నేతృత్వంలో పంజాబ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement