
ఐపీఎల్ మెగా వేలం- 2022(PC: IPL)
IPL 2022 Mega Auction News: ఐపీఎల్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. క్యాష్ రిచ్ లీగ్ మెగా వేలం-2022 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అత్యధిక ధర పలికే ఆటగాళ్లు వీరేనని అంచనా వేశాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేశాడు. ఇందులో సెహ్వాగ్ మాట్లాడుతూ... ‘‘ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో నా అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నాను.
ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్ల జాబితాలో ఐదుగురు భారత ఆటగాళ్లను ఎంపిక చేశాను. వీరిలో శిఖర్ ధావన్ నంబర్ 1గా ఉంటాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్... శ్రేయస్ అయ్యర్. ఇక నాలుగో ఆటగాడిగా యజువేంద్ర చాహల్ ఉంటాడు. ఇషాన్ కిషన్ నంబర్ 5. నాకు తెలిసి ఈ ఐదుగురు వేలంలో హైలైట్గా నిలుస్తారు’’ అని జోస్యం చెప్పాడు.
ఇక విదేశీ ఆటగాళ్లలో... డేవిడ్ వార్నర్, ట్రెంట్ బౌల్ట్, జేసన్ హోల్డర్, మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్కు భారీ డిమాండ్ ఉంటుందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ ఐదుగురిని సొంతం చేసుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడతాయని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, అశ్విన్, వార్నర్, జేసన్ హోల్డర్, కమిన్స్, డుప్లెసిస్, ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ రేసులో ముందుంటారని సెహ్వాగ్ అంచనా వేశాడు. కాగా ఫిబ్రవరి 12, 13(శని, ఆదివారాల్లో) తేదీల్లో మెగా వేలం జరుగనున్న సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022 Mega Auction: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర.. అతడి కోసం ఏకంగా రూ. 20 కోట్లు!