భారత పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్ ఫుల్టన్ వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత హాకీ జట్టు మెగా ఈవెంట్లతో బిజీ షెడ్యూల్తో గడపనుంది. మరీ ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రపంచకప్, ఆసియా క్రీడల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ రెండు మేజర్ టోర్నీలకు కలిపి ఒకే జట్టు బరిలోకి దిగుతుందని పురుషుల హాకీ హెడ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ స్పష్టం చేశారు. తద్వారా రెండు వేర్వేరు జట్లను తయారు చేస్తారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. ప్రపంచకప్, ఆసియా క్రీడలకు మధ్య కేవలం మూడు వారాల విరామమే ఉండటంతో ఆటగాళ్ల ఫిట్నెస్, పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు రెండు జట్లను సిద్ధం చేస్తారని వ్యాఖ్యలు వినిపించాయి.
అయితే ప్రపంచకప్ కోసం సన్నద్ధం చేసే మెరుగైన, ధీటైన జట్టునే ఆసియా క్రీడల్లోనూ ఆడిస్తామని ఆయన చెప్పారు. నిజానికి 15 నెల క్రితం నుంచే ప్రణాళికా బద్ధంగా జట్టు నిర్మాణ ప్రక్రియ చేపట్టామని, ఇందులో భాగంగానే భారత ‘ఎ’ జట్టుపై దృష్టి సారించామని, భవిష్యత్ అవసరాల కోసం సత్తాగల యువ రక్తాన్ని సీనియర్ జట్టుకు ఎక్కించేందుకే ఇలా చేశామని కోచ్ వివరించారు. అప్పుడు జట్టు సీనియర్లు, యువకుల మేళవింపుతో సమతూకంగా ఉంటుందని దక్షిణాఫ్రికాకు చెందిన కోచ్ క్రెయిగ్ చెప్పారు.
‘భారత జట్టుకు వరుస టోర్నీలు ఆడిన అనుభవం ఇదివరకు ఉంది. అజ్లాన్ షా, దక్షిణాసియా క్రీడలు, ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఇలా గతంలో పెద్ద పెద్ద టోర్నీలెన్నో ఆడింది. కాబట్టి పని ఒత్తిడి భారం అనే సమస్యయితే ఉండదు. జూన్లో హాకీ ప్రొ లీగ్ జరుగుతుంది. ఇది ముగిసిన వెంటనే ప్రపంచకప్లో బరిలోకి దించే జట్టుపై తుది కూర్పు పూర్తవుతుంది. అలా ఎంపికైన జట్టే బెల్జియం–నెదర్లాండ్స్కు వెళుతుంది. ఆ తర్వాత జపాన్కు బయల్దేరుతుంది’ అని క్రెయిగ్ పూర్తి స్పష్టత ఇచ్చారు.
బెల్జియం, నెదర్లాండ్స్ ఉమ్మడిగా నిర్వహించబోయే ప్రపంచకప్ హాకీ ఈవెంట్ ఆగస్టు 15 నుంచి 30 వరకు జరుగుతుంది. ఇది ముగిసిన మూడు వారాల్లోపే సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో ఆసియా క్రీడలు జరుగనున్నాయి. జపాన్ ఈవెంట్ లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్కు క్వాలిఫయర్స్గా జరుగబోతుంది.


