KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్‌ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో!

Ind Vs Ban: KL Rahul On Rishabh Release And Dropped Chances Hurt Us - Sakshi

Bangladesh vs India, 1st ODI- KL Rahul- Rishabh Pant: ‘‘గత ఆరేడు నెలల కాలంలో మేము ఎక్కువగా వన్డే మ్యాచ్‌లు ఆడింది లేదు. అయితే, 2020-21 మధ్య కాలంలో నేను వికెట్‌ కీపర్‌గా వ్యవహరించాను. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాను. జట్టు ప్రయోజనాల మేరకు మేనేజ్‌మెంట్‌ నాకు అప్పగించిన పనిని పూర్తి చేస్తాను. 

నిజానికి రిషభ్‌ పంత్‌ను ఎందుకు తుది జట్టు నుంచి తప్పించారో నాకు తెలియదు. ఆ విషయాన్ని వైద్య బృందమే చెప్పాలి. ఆటలో ఇలాంటి గెలుపోటములు సహజం. ముఖ్యంగా క్రికెట్‌లో ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంటుంది.

నిజానికి ఈ మ్యాచ్‌లో మెహదీ అద్భుత ఇన్నింగ్స్‌, గెలుపు కోసం వాళ్లు పోరాడిన తీరు మాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒకటీ రెండు క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం వల్ల భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

ఏదేమైనా బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. మెహదీ రిస్కీ షాట్లు ఆడి వాటి నుంచి ఫలితం రాబట్టగలిగాడు. స్వదేశంలో ఆడటం బంగ్లాకు అనుకూల అంశం. సొంతగడ్డపై మాకు సవాల్‌ విసరగలిగారు. ఇక ఈ మ్యాచ్‌లో మేము కొన్ని తప్పులు చేశాం. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. తదుపరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతాం’’ అని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు.

పంత్‌ను ఎందుకు తప్పించారో?!
గత కొన్నాళ్లుగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ వైఫల్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ పర్యటనలో ఆదివారం నాటి తొలి వన్డేలో పంత్‌ తుది జట్టులో కనిపించలేదు. న్యూజిలాండ్‌ టూర్లో అతడు గాయపడ్డాడని వార్తలు వినిపించినా.. గాయంపై ఎలాంటి విషయంపై స్పష్టత ఇవ్వకుండానే, వైద్యుల సూచనల మేరకు రిషభ్‌ పంత్‌ను వన్డే సిరీస్‌ జట్టు నుంచి తప్పించినట్లు బీసీసీఐ ప్రకటించడం విశేషం. 

ఫలితంగా ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించాడు. బ్యాటింగ్‌లో అందరికంటే మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడిన అతను కీపింగ్‌లో ఒకే ఒక్క తప్పుతో భారీగా విమర్శలు మూటగట్టుకున్నాడు. కీలక సమయంలో బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడవటం రాహుల్‌పై ట్రోలింగ్‌కు కారణమైంది.

గుణపాఠం లాంటిది!
ఈ నేపథ్యంలో రాహుల్‌ మాట్లాడుతూ.. పైవిధంగా స్పందించాడు. పంత్‌ను ఎందుకు తప్పించారో తనకు తెలియదని.. తనకు తెలిసిందల్లా జట్టు అవసరాలకు అనుగుణంగా తన కర్తవ్యాలను నిర్వర్తిస్తానని పేర్కొన్నాడు. క్యాచ్‌ జారవిడవటం తనను బాధించిందని.. అయితే, తప్పులు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు.

ట్రెండింగ్‌లో రాహుల్‌... పంత్‌ దరిద్రం నీకు పట్టింది!
కాగా బంగ్లాతో తొలి వన్డేలో టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ టాప్‌ స్కోరర్‌. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. 70 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు చేశాడు.

రాహుల్‌ ఇన్నింగ్స్‌ కారణంగానే భారత్‌ కనీసం ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కానీ ఆ ఒక్క క్యాచ్‌ మిస్‌ చేయడం వల్ల అతడు విమర్శలపాలు కావడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

‘‘పంత్‌ దరిద్రం నీకు పట్టినట్టుంది భయ్యా! అతడి స్థానంలో కీపింగ్‌ బాధ్యతలు చేపట్టావు. అదే శాపమైనట్లుంది! మొన్నటిదాకా అతడిపై.. ఇదిగో ఇప్పుడు నీపై ఈ ట్రోలింగ్‌. నువ్వన్నట్లు ఆటలో గెలుపోటములు సహజం. నువ్వు ఆ మాత్రం స్కోరు చేయకపోతే పరిస్థితి ఏమయ్యేదో?. అయినా నిన్ను ట్రోల్‌ చేసే వాళ్లకు ఇదేం పోయేకాలమో!’’ అంటూ రాహుల్‌కు అండగా నిలబడుతున్నారు. కాగా గత మ్యాచ్‌లలో పంత్‌ విఫలమైన నేపథ్యంలో సోషల్‌ మీడియాలో అతడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే.

చదవండి: Ind Vs Ban: రాహుల్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడం వల్ల కాదు.. బంగ్లా చేతిలో ఓటమికి కారణం వాళ్లే: భారత దిగ్గజం
IPL Mini Auction: అతడి కోసం లక్నో పోటీ పడుతుంది! సీఎస్‌కే కూడా: అశ్విన్‌

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top