సింగిల్‌ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్‌ | IND vs AUS 3rd ODI SCG Crowd Standing Ovation Big Cheers For Kohli Video | Sakshi
Sakshi News home page

సింగిల్‌ తీసిన కోహ్లి.. దద్దరిల్లిన స్టేడియం.. వీడియో వైరల్‌

Oct 25 2025 2:25 PM | Updated on Oct 25 2025 3:17 PM

IND vs AUS 3rd ODI SCG Crowd Standing Ovation Big Cheers For Kohli Video

టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియా తాజా పర్యటనలో పరుగుల ఖాతా తెరిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్‌ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో తన మార్కు చూపిస్తున్నాడు.

కాగా కెరీర్‌ చరమాంకానికి చేరుకున్న కోహ్లికి ఇదే ఆఖరి ఆసీస్‌ టూర్‌ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెర్త్‌, అడిలైడ్‌లో కోహ్లి ఆట చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. అయితే, రాజు ఎక్కడైనా రాజే అన్నట్లుగా అడిలైడ్‌ వన్డేలో ఈ లెజెండరీ బ్యాటర్‌ డకౌట్‌ అయినా.. టీమిండియా, ఆసీస్‌ అభిమానులు స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇచ్చి కోహ్లి పట్ల ప్రేమను చాటుకున్నారు.

తాజాగా శనివారం నాటి మూడో వన్డేలో కోహ్లి బ్యాటింగ్‌కు వస్తున్నపుడే సిడ్నీ క్రౌడ్‌... లేచి నిలబడి అతడిని చీర్‌ చేస్తూ ఎమోషనల్‌ అయింది. కాగా ఆస్ట్రేలియా విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఓపెనర్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ త్వరగానే పెవిలియన్‌ చేరాడు.

మొత్తంగా 26 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. భారత ఇన్నింగ్స్‌ పదకొండో ఓవర్లో రెండో బంతికి జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి.. రోహిత్‌ శర్మతో కలిసి సింగిల్‌ పూర్తి చేసుకున్నాడు.

దీంతో సిడ్నీ ప్రేక్షకుల సంబరాలు అంబరాన్నంటాయి. కోహ్లి ఒక్క పరుగు పూర్తి చేసుకోగానే స్టేడియం కేరింతలతో దద్దరిల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 16 ఓవర్ల ఆట (డ్రింక్స్‌ బ్రేక్‌) పూర్తయ్యేసరికి రోహిత్‌ 49 బంతుల్లో 43, కోహ్లి 21 బంతుల్లో 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

ఇక మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్‌ ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామమాత్రపు మూడో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన మార్ష్‌ బృందం.. 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

భారత యువ పేసర్‌ హర్షిత్‌ రాణా నాలుగు వికెట్లతో రాణించగా.. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు. సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. కోహ్లి మాథ్యూ షార్ట్‌ (30), కూపర్‌ కన్నోలి (23) క్యాచ్‌లు అందుకుని టీమిండియా కీలక వికెట్లు దక్కించుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement