ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్కు శ్రీలంక జట్టు ఊహించని షాకిచ్చింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కెప్టెన్ అమేలియా కెర్ (45), సోఫీ డివైన్ (45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లతో సత్తా చాటగా.. మిథాలీ అయోధ్య, సుగంధిక కుమారి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, నిమష మీపగే తలో వికెట్ తీశారు.
అనంతరం 151 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆదిలో తడబడినప్పటికీ (55 పరుగులకే 4 వికెట్లు).. నిలాక్షిక డిసిల్వ (54 నాటౌట్), కౌషని నుత్యాంగన (24 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో మెరిసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు.
వీరిద్దరూ సత్తా చాటడంతో లంక జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే (19.4 ఓవర్లు) లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్ల నష్టానికి). కివీస్ బౌలర్లలో నెన్సి పటేల్ (4-0-23-2), రోస్మేరి (4-1-28-0), బ్రీ ఇల్లింగ్ (4-0-33-1) రాణించినా నిలాక్షిక, కౌషని జోడీని నిలువరించలేకపోయారు.
ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఇది వరుసగా రెండో ఓటమి. శ్రీలంకకు ముందు ఈ జట్టు విండీస్ చేతిలో కూడా చిత్తైంది. లంక విషయానికొస్తే.. ఈ ఎడిషన్లో ఈ జట్టుకు ఇదే తొలి గెలుపు. దీనికి ముందు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడింది.


