న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లకు భారత మహిళల హాకీ జట్టు సన్నాహాలు మొదలుపెట్టనుంది. ఆగస్టులో నెదర్లాండ్స్–బెల్జియంలలో జరిగే ప్రపంచకప్ టోర్నీకి... సెప్టెంబర్–అక్టోబర్లలో జపాన్లో జరిగే ఆసియా క్రీడలకు టీమిండియా సమాయత్తం కానుంది.
ఈ నేపథ్యంలో ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకోవాలని... మైదానంలో అమలు చేసే వ్యూహాలకు పదును పెట్టుకోవాలని భారత బృందం నిర్ణయించుకుంది. రేపటి నుంచి బెంగళూరులోని భారత స్పోర్ట్స్ అథారిటీ ఎక్స్లెన్స్ సెంటర్లో జరిగే ఈ శిబిరంలో 31 మంది ప్రాబబుల్స్ పాల్గొంటారు. ఈ నెలారంభంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు రన్నరప్గా నిలిచి వరల్డ్కప్ బెర్త్ను దక్కించుకుంది.
‘రాబోయే సీజన్ అత్యంత పోటీతత్వంతో కూడింది. దీని కోసం మేము చేస్తున్న సన్నద్ధతలో భాగమే ఈ శిబిరం. ఆటలో నిలకడను పెంపొందించడం, మా వ్యూహాలను మరింత మెరుగుపరుచుకోవడం ఈ శిబిరం ఉద్దేశం. రాబోయే రెండు ప్రతిష్టాత్మక టోరీ్నల్లో ఒత్తిడిని అధిగమించి, కీలక సమయాల్లో రాణించగలిగే జట్టును రూపొందించాలని భావిస్తున్నాం’ అని భారత మహిళల జట్టు హెడ్ కోచ్ జోర్డ్ మరీన్ తెలిపారు.
భారత మహిళల హాకీ ప్రాబబుల్స్
సవిత పూనియా, మాధురి కిండో, బిచ్చూ దేవి ఖరీబం, బన్సారి సోలంకి (గోల్కీపర్లు), నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ, జ్యోతి సింగ్, లాల్థట్లాంగి, జ్యోతి, ఉదిత, శిల్పి దబాస్ (డిఫెండర్లు), సుశీలా చాను, మనీషా చౌహాన్, వైష్ణవి ఫాల్కే, సాక్షి రాణా, సునెలితా టొప్పో, సలీమా టెటె, నేహా, ఇషిక (మిడ్ ఫీల్డర్లు), దీపిక సోరెంగ్, రుతుజా పిసాల్, బల్జీత్ కౌర్, నవ్నీత్ కౌర్, దీపిక, అన్ను, బ్యూటీ డుంగ్డుంగ్, హీనా బానో, సోనమ్, లాల్రెమ్సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత కుమారి (ఫార్వర్డ్స్).


