సొంతమా... సమమా! | The fourth T20 match between India and England is today | Sakshi
Sakshi News home page

సొంతమా... సమమా!

Jan 31 2025 2:32 AM | Updated on Jan 31 2025 5:26 AM

The fourth T20 match between India and England is today

నేడు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య నాలుగో టి20 మ్యాచ్‌

టీమిండియా గెలిస్తే సిరీస్‌ 3–1తో కైవసం

ఇంగ్లండ్‌ నెగ్గితే సిరీస్‌ 2–2తో సమం

ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

పుణే: ఓ జట్టుది సిరీస్‌ గెలిచే ఆరాటం... మరో జట్టుది సిరీస్‌లో నిలిచే పోరాటం... వేదికేమో పరుగుపెట్టే పుణే స్టేడియం... ఈ నేపథ్యంలో భారత్(India), ఇంగ్లండ్‌(England) జట్ల మధ్య శుక్రవారం జరిగే నాలుగో టి20(T20) అసలైన మెరుపుల మజాను పంచనుంది. ఆశించినట్లు రాత్రి ఇదే జరిగితే నిజమైన చుక్కలతో పాటు బంతి కూడా పదేపదే చుక్కల్లోకెక్కడం ఖాయం! ఈ పరుగుల విందులో పైచేయి సాధిస్తే భారత్‌ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను ఎగరేసుకుపోతుంది. 

కానీ గత మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ పట్టుబిగిస్తే మాత్రం సిరీస్‌ 2–2తో సమమవుతుంది. అప్పుడు ఇరుజట్లు ద్వైపాక్షిక సిరీస్‌ కోసం ‘ఫైనల్స్‌’ ఆడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో నాలుగో టి20 ఈ సిరీస్‌లోనే ఆసక్తికర సమరంగా జరగనుంది. దీంతో ప్రేక్షకులకు గత మూడు మ్యాచ్‌లుగా కరువైన టి20 విందు ఈ పోరుతో తీరుతుంది. 

సామ్సన్‌కు ఏమైంది... 
భారత స్టార్లు రోహిత్, కోహ్లిలు టి20లకు బైబై చెప్పడంతో తదుపరి టి20 ప్రపంచకప్‌కు కోచ్‌ గంభీర్‌ సన్నద్ధం చేసే జట్టులో ఓపెనర్‌ సంజూ సామ్సన్‌ కీలకం. కోచ్‌ గౌతీ వచ్చాక ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్‌లో అతనికి విరివిగా ఆవకాశాలిస్తున్నాడు. అతనూ గత సిరీస్‌లలో వరుస సెంచరీలు, లేదంటే ఓపెనింగ్‌ మెరుపులతో అలరించాడు.కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. 

ఇది ఇన్నింగ్స్‌పై పెద్ద ప్రభావమే చూపిస్తోంది. దీనికి కెప్టెన్  సూర్యకుమార్‌ వైఫల్యం అదనం! దీనివల్ల టీమిండియా రెండు మ్యాచ్‌లైతే గెలిచింది కానీ... టి20లకు తగిన ఆటతీరును మాత్రం టి20 ప్రపంచ చాంపియన్‌ ఇంకా ఆడలేదన్నది వాస్తవం. బౌలింగ్‌ విభాగంలో షమీని కొనసాగించి, విశ్రాంతినిచి్చన అర్‌‡్షదీప్‌ను తుది జట్టులోకి తీసుకుంటే... గత మ్యాచ్‌లో భారీగా పరుగులు ఇచ్చుకున్న స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను పక్కనబెట్టే అవకాశముంది.
 
పుంజుకున్న బట్లర్‌ బృందం 
మూడో టి20లో మెరిపించి తర్వాత కుదుపులకు గురైనా కూడా కోలుకున్న తీరు, పుంజుకున్న వైనం ఇంగ్లండ్‌ జట్టులో సిరీస్‌ ఆశల్ని రేపింది. ఇదే సమరోత్సాహంతో ఇప్పుడు వరుసగా రెండో విజయంపై కన్నేసిన బట్లర్‌ సేన సిరీస్‌ను 2–2తో సమం చేయడానికి సర్వసన్నద్ధమై ఉంది. 

సాల్ట్‌ ఓపెనింగ్‌లో దంచేస్తే ఇంగ్లండ్‌ జోరుకు అదనపు బలం ఖాయం. ఆర్చర్, వుడ్, కార్స్‌లతో పాటు స్పిన్‌తో కట్టిపడేస్తున్న అదిల్‌ రషీద్‌ ఉన్న బౌలింగ్‌ విభాగం భారత్‌కు సవాల్‌ విసిరేందుకు సై అంటోంది. 

4 పుణేలోని మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) స్టేడియంలో ఇప్పటి వరకు భారత జట్టు నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2 మ్యాచ్‌ల్లో గెలిచి, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంగ్లండ్‌ జట్టుతో 2012 ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మిగతా మూడు టి20 మ్యాచ్‌లు శ్రీలంక జట్టుతో జరిగాయి. 

పిచ్, వాతావరణం 
పుణే పిచ్‌ బ్యాటింగ్‌కు, ప్రత్యేకించి పొట్టి ఫార్మాట్‌ మెరుపులకు అనువైంది. రెండేళ్ల క్రితం శ్రీలంక 200 పైచిలుకు స్కోరు చేస్తే... ఛేదనలో భారత్‌ 190 వరకు వచ్చి కేవలం 15 పరుగుల తేడాతోనే ఓడింది. ఈ నేపథ్యంలో బౌలర్లకు సవాల్‌ తప్పదు. వాతావరణంతో ఏ సమస్యా లేదు. వానముప్పూ లేదు. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సామ్సన్, అభి షేక్, తిలక్‌వర్మ, హార్దిక్‌ పాండ్యా, సుందర్, అక్షర్, జురేల్, షమీ, రవిబిష్ణోయ్‌/అర్ష్ దీప్, వరుణ్‌.  
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), సాల్ట్, డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్‌ రషీద్, మార్క్‌ వుడ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement