అన్వయ్ ద్రవిడ్ , ఆర్యవీర్ సెహ్వాగ్
భారత అండర్–19 జట్టులో ద్రవిడ్ తనయుడు అన్వయ్, సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ ఎంపిక
ఆస్ట్రేలియాతో సిరీస్లకు భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ల కుమారులు... అండర్–19 జట్టుకు ఎంపికయ్యారు. ఏజ్ గ్రూప్ క్రికెట్లో సత్తాచాటుతున్న రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్... వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ భారత యువ జట్టులో చోటు దక్కించుకున్నారు. వచ్చే నెలలో ఆ్రస్టేలియా అండర్–19 క్రికెట్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న ఈ పర్యటన అక్టోబర్ 8తో ముగియనుంది.
అహ్మదాబాద్ వేదికగా సెప్టెంబర్ 18, 21, 23న వరుసగా మూడు వన్డే మ్యాచ్లు జరగనుండగా... సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు తొలి యూత్ టెస్టుకు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక అక్టోబర్ 5 నుంచి 8 వరకు చివరి టెస్టు మ్యాచ్ రాజ్కోట్లో జరగనుంది. అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్... వన్డే జట్టులో మాత్రమే అవకాశం దక్కించుకున్నారు. గత నెలలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండో వన్డేలో వికెట్ కీపర్ అన్వయ్ ద్రవిడ్ 87 పరుగులతో సత్తా చాటాడు. వన్డే జట్టుకు లక్ష్య రాయ్చందానీ కెప్టెన్గా వ్యవహరించనుండగా... యశ్వర్ధన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో యశవర్ధన్ చౌహాన్ కెప్టెన్ కాగా... లక్ష్య అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవల శ్రీలంకతో సిరీస్లో లక్ష్య ఆకట్టుకున్నాడు. రెండు మ్యాచ్ల సిరీస్లో 153.50 సగటుతో 307 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ ఉన్నాయి. ఉత్తరాఖండ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ సైతం ఆడిన అతడు... 4 మ్యాచ్ల్లో మూడు హాఫ్సెంచరీల సాయంతో 223 పరుగులు చేశాడు.
భారత అండర్–19 వన్డే జట్టు: లక్ష్య రాయ్చందాని (కెప్టెన్), యశ్వర్ధన్ చౌహాన్, రజత్ బఘేల్, ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుషాగ్ర ఓజా, అర్జున్ రాజ్పుత్, మనాల్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్, యశ్వీర్, రోహిత్ యాదవ్, షవిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకటనాగ విజయ సుభాశ్, కావ్య పటేల్.
భారత్ అండర్–19 టెస్టు జట్టు: యశ్వర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయ్చందాని, సాగర్ విర్క్, కుషాగ్ర ఓజా, మనాల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ, అభిప్రాయ్ విశ్వాస్, రోహిత్ యాదవ్, ఇషాన్ ఓం, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాన్షు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్.


