శ్రీలంక క్రికెట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఇద్దరు అండర్-19 క్రికెటర్లు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోటల్ బాత్రూమ్లలో మహిళలు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియోలు తీశారనే ఆరోపణలపై సదరు ఆటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొలంబోలోని నారాహెన్పిటాలో ఓ హోటల్లో జరిగిన కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కొంతమంది మహిళా వైద్యులు అక్కడికి వచ్చారు. అయితే తాము స్నానం చేస్తుండగా ఎవరో మొబైల్ ఫోన్లతో రహస్యంగా వీడియోలు తీస్తున్నట్లు వారు గమనించారు. దీంతో ఈ ఘటనపై వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడింది అండర్-19 క్రికెటర్లేనని తేల్చినట్లు శ్రీలంక మిర్రర్ తమ కథనంలో పేర్కొంది. దీంతో సదరు క్రికెటర్లను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే వారికి మెజిస్ట్రేట్ వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల (శ్రీలంక రూపీ) చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
కాగా పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణలో వారిద్దరూ మహిళలను మాత్రమే కాకుండా కొంతమంది పురుషుల వీడియోలను కూడా తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నిందుతులగా ఉన్న ఆ ఇద్దరు యువ క్రికెటర్లు క్యాండీలోని ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ జోసెఫ్, వాజ్ కాలేజ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ వివాదంపై శ్రీలంక క్రికెట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్


