PC: BCCI/IPL
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్లు వేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లి(28), దేవ్దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం గుజరాత్ టైటాన్స్ ఈ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(43) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని పాటిదార్ తెలిపాడు.
"ఈ పిచ్పై మేము సాధించిన స్కోర్ మాత్రం సరిపోదు. అయినప్పటికి మా బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. మ్యాచ్ను 16 ఓవర్లకు తీసుకొచ్చారు. ఇది మాకు ఒక సానుకూల ఆంశం. పిచ్పై ఉన్న పచ్చిక ఫాస్ట్ బౌలర్లకు బాగా సహకరించింది. అయితే శుభ్మన్ గిల్ పవర్ప్లేలో దూకుడుగా ఆడి మాపై ఒత్తిడి పెంచాడు. కానీ అంత ఒత్తిడిలోనూ మా బౌలర్లు తిరిగి పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం. గిల్ను ఆరంభంలోనే ఔట్ చేసి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది. ఇక ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం.
ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బ తీసింది. ఇక భువనేశ్వర్ కుమార్ గురుంచి మనందరికీ తెలిసిందే. అతడు టీ20 ఫార్మాట్లో ఎంతో అనుభవం ఉన్న బౌలర్. ఈ మ్యాచ్లో కూడా తన మార్క్ చూపించాడు.
ఇక ఈ టోర్నీలో మాకు ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి మేము పాయింట్ల పట్టిక గురుంచి ఆలోచించడం లేదు. మా తదుపరి మ్యాచ్లో అత్యత్తుమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యమని" పాటిదార్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో మే7న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.
చదవండి: శ్రేయస్, సంజూ కాదు!.. భారత టీ20 కెప్టెన్గా ఊహించని పేరు!


