● సిద్దిపేటలో ముస్లింల శాంతి ర్యాలీ ● భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకాలని ముస్లిం మత పెద్దలు అన్నారు. బుధవారం మిలాద్ ఉన్ నబీని ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈద్గా మైదానం వద్ద ఉన్న జనుల్లా షా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలతో ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ప్రవక్త చేసిన ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకాలని తెలిపారు. మనుషుల్లో కుల, మత తారతమ్యాలు చూడొద్దని, మనుషులు మానవత్వం కలిగి ఉండాలని తెలిపారన్నారు. నేటి యువత ప్రవక్త చూపిన బాటలో నడవాలన్నారు. కార్యక్రమంలో మత పెద్దలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.


