● కలెక్టర్ హైమావతి
● గడువులోగా పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు
● ఇర్కోడులో మొక్కలు నాటిన కలెక్టర్
సిద్దిపేటరూరల్: జిల్లాలో భూముల రీ–సర్వేను అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి సర్వే–ల్యాండ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో భూమి రీసర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రీ సర్వే పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్రమం తప్పకుండా నివేదికలు సమర్పించాలన్నారు. ప్రతి లైసెన్స్డ్ రీ–సర్వేయర్కు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా సర్వే పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న భూమి రికార్డులను, సరిహద్దులను, విస్తీర్ణాన్ని ఆధునిక సర్వే పద్ధతులతో మళ్లీ కొలిచి, రికార్డులతో సరిపోల్చేలా పగడ్బందీగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా వనమహోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ మొక్కను నాటారు. జిల్లాలో 17 లక్షల మొక్కలను గాను ఇప్పటివరకు 12 లక్షల మొక్కలు నాటినట్లున్నారు. ఈనెల చివరి నాటికి పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట సర్వే ల్యాండ్ ఏడీ సుదర్శన్, మండల సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కామన్ డైట్ మెనూ పాటించాలి..
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పకుండా పాటించాలని కలెక్టర్ హైమావతి పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నగుండవెల్లిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో మెనూ పాటించడంలేదని, ప్రధానోపాద్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించారు.


