● రేషన్లో ముక్కిన బియ్యం ● లబ్ధిదారుల ఆగ్రహం
మర్కూక్(గజ్వేల్): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం ముక్కిపోయి తుట్టెలు కట్టి, పురుగులు పట్టినవి రావడంతో లబ్ధిదారులు మండిపడుతున్నారు. రేషన్ దుకాణాల్లోకి 3 నెలల బియ్యం ఒకే సారి రావడంతో పురుగులు పట్టినవి వస్తున్నాయని వాపోతున్నారు. మర్కూక్ మండలంలో 14 రేషన్ షాపులు ఉండగా ఆదివారం మర్కూక్ రేషన్ షాపుతో పాటు కొన్ని షాపులకు సరఫారా అయిన బియ్యం పురుగులు, ముక్కిపోయినవి వచ్చాయి. అంతేకాక దొడ్డుబియ్యం, రాళ్లు, దుమ్ము ఉండటంతో ఎలా వండుకుని తినాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బియ్యం వండుకుని తింటే రోగాల బారిన పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యం సరఫారా చేయాలని ఆయా గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు.


