వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి క్షేత్రం స్వాతి నక్షత్ర మహోత్సవంతో అలరారింది. గిరి ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. బుధవారం లక్ష్మీనృసింహుని జన్మనక్షత్ర వేడుకలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. మహోత్సవంలో భాగంగా ఉదయం ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో ఉత్తర ద్వారం నుంచి గిరి ప్రదక్షిణ సంరంభం ప్రారంభమైంది. మాజీ చైర్మెన్ రవీందర్గుప్త, మాజీ ధర్మకర్తలు, వేలాది భక్తజన సందోహం నారసింహుని స్మరిస్తూ, నృత్యాలు చేస్తూ నాచగిరి కొండలు, హరిద్రానది తీరం, గోశాలను దాటుతూ గిరి ప్రదక్షిణ చేశారు. ఉత్తర ద్వారం వద్ద శ్రీవారికి హారతి అనంతరం జన్మ నక్షత్రవేళ శ్రీవారిని దర్శించుకుని తరించారు. మల్కాజిగిరి డీసీపీ నర్సింహారెడ్డి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం అందజేశారు.
భక్తజన ప్రదక్షిణం..


