ముగ్గురికి డెంగీ
వణికిస్తున్న
● ముగ్గురికి డెంగీ పాజిటివ్
● ప్రభుత్వ ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వర పీడితులు
హుస్నాబాద్: వాతావరణంలో వస్తున్న మార్పులు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా జనం వైరల్ ఫీవర్తో మంచాన పడుతున్నారు. ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాల బారిన పడిన జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి జ్వరపీడితులతో కిటకిట లాడుతోంది. 35 మందికి పైగా వైరల్ ఫీవర్తో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజు 350 మందికిపైగా రోగులు వివిధ ఆరోగ్య సమస్యలతో పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇందులో దాదాపు 40 మందికి పైగా వైరల్ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి.
పడకేసిన పారిశుద్ధ్యం
హుస్నాబాద్లో పారిశుద్ధ్య లోపించడంతో దోమలు వ్యాప్తి చెంది జనం రోగాల బారిన పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైనేజీలు చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లుతోంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధుల్లో నీరు నిలవడం, ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దోమలకు స్థావరాలుగా మారాయి. మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో జనం వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఫొటోలకు పోజులు ..
హుస్నాబాద్లో మున్సిపల్ అధికారులు ప్రతిరోజు వార్డుల వారీగా ‘సఫాయి అప్నా.. భీమారీ బగావో’ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే కేవలం ఫొటోలకే పరిమతమై డ్రైనేజీలు శుభ్రం చేయించడం లేదని, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అవగాహన కార్యక్రమాలు ఆర్బాటంగా నిర్వహిస్తున్నామని చెప్పుకొంటున్న అధికారులు పారిశుద్ధ్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని వాపోతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు వందలాది మందికి రక్త, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షల్లో భాగంగా ముగ్గురికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. పట్టణానికి చెందిన ఒకరు, అలాగే పోతారం(ఎస్), మహ్మదాపూర్కు చెందిన మరో ఇద్దరికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. తాగునీటి కలుషితం, పరిసరాల అపరిశుభ్రత, వాతావరణ మార్పులతో జనం జ్వరాల బారిన పడుతున్నారని వైద్యాధికారులు అంటున్నారు.


