● యూసీఎఫ్ ఇండియా సెంటర్ సైంటిస్ట్ ఇన్ రెసిడెన్స్గా ఎంపిక
● లచ్చపేటలో సంబరాలు
దుబ్బాక: నిజాం ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్(నిమ్స్)లో అడిషనల్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసర్జన్గా పనిచేస్తున్న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన డాక్టర్ తిరుమల్ యెర్రగుంటకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా(యూసీఎఫ్)ప్రతిష్టాత్మక సైంటిస్టు ఇన్ రెసిడెన్స్ కార్యక్రమానికి ఎంపికై న తొలి భారతీయ డాక్టర్గా తిరుమల్ నిలిచారు. ఈ నెల 13 నుంచి 16 వరకు ప్రత్యేక అకడమిక్ కార్యక్రమంలో తిరుమల్ యూసీఎఫ్ అధ్యాపకులు , మెడికల్, ఫ్రీ మెడికల్ విద్యార్థులు, వైద్య నిపుణులతో న్యూరోవిభాగానికి సంబంధించిన సమావేశాల్లో చర్చించనున్నారు.
ఆధునిక న్యూరో సర్జరీపై ప్రత్యేక ఉపన్యాసం
యూసీఎఫ్ కాలేజీ ఆఫ్ మెడిసిన్లో గురువారం డాక్టర్ తిరుమల్ ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. వైద్య విద్య, ఆధునిక న్యూరో సర్జరీ, భారతీయ వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అండ్ ఏఐ పాత్ర, భారత్–అమెరికా వైద్య విద్యాసంస్థల మధ్య సహకారం వంటి అంశాలపై ప్రసంగించారు. అలాగే ఇండియా డాక్టర్ల బృందంతో కలిసి టెంపుల్ క్లీనింగ్ కార్య్రక్రమంలో పాల్గొన్నట్లు డాక్టర్ తిరుమల్ సాక్షికి ఫోన్లో తెలిపారు.
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రత్యేక అతిథి
ఆగష్టు 15న యూసీఎఫ్ ఇండియా సెంటర్ నిర్వహించే భారత స్వాతంత్య్ర వేడుకల్లో డాక్టర్ తిరుమల్ ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయనకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కడంపై ఆయన స్వస్థలం దుబ్బాక మున్సిపల్ లచ్చపేటలో సంబురాలు జరుపుకొన్నారు. తిరుమల్ తల్లిదండ్రులు సుజాత ప్రసాద్తో పాటు ఆయన స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.


