● చెట్ల కిందే భోజనాలు చేస్తున్న విద్యార్థులు ● పట్టించుకోని అధికారులు ● మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
గజ్వేల్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న ప్రభుత్వం వారికి కావాల్సిన మౌలిక సౌకర్యాలను కల్పించడంలో మాత్రం విస్మరించింది. దీంతో తమ పిల్లలు భోజనాలు ఎలా చేయాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గజ్వేల్ పట్టణంలోని బాలుర, బాలికల ఎడ్యుకేషన్ హబ్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థినులుండగా, బాలుర ఎడ్యుకేషన్ హబ్లోని ఉన్నత పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యా హ్న భోజనం అందిస్తున్నప్పటికీ కూర్చుని తినేందుకు సరైన వసతి(డైనింగ్ హాల్) లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్న భోజనాన్ని నేలపైనే కూర్చోని తింటున్నారు. మధ్యాహ్న భోజనం సమయంలో వర్షం వస్తే ప్లేట్లను పట్టుకుని పాఠశాలల్లోకి పరుగులు పెడుతున్నారు.
తాగునీటికీ తిప్పలు
విద్యార్థులు భోజనం చేసే ప్రాంతంలో మంచినీటి సౌకర్యం లేకపోవడంతో తాము వెంట తెచ్చుకున్న వాటర్ బాటిళ్లతోనే సరిపెట్టుకుంటున్నారు. బాలికల హబ్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు తాము ఇంటి నుంచి తెచ్చుకున్న మంచినీరు అయిపోతే పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ నీటిని వాడుకుంటుండగా, బాలుర హబ్లోని ఉన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఈ రెండు పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో చొరవ చూపి విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే ప్రాంతం వద్ద విద్యార్థులందరికీ సరిపడ డైనింగ్ హాల్తోపాటు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
చొరవ చూపాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్లను నిర్మించి 8 ఏళ్లు పూర్తవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.
–రమణకార్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి


