● నీటి సంరక్షణతో విపత్తును ఎదుర్కొందాం ● కలెక్టర్ హైమావతి
నంగునూరు(సిద్దిపేట): ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటాయని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి విపత్తును ఎదుర్కోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి రైతులకు సూచించారు. రైతునేస్తం 100వ ఎపిసోడ్లో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ను కలెక్టర్ హైమావతి రైతులతో కలసి నర్మేటలో వీక్షించారు. ఎల్నినో ప్రభావం, వాతావరణ పరిస్థితు లు, భూగర్భ జలాల పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ఫామ్ సాగుపై మంత్రి రైతులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో లోటు వర్షపాతం నమోద వుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో రైతులు వరికి ప్రత్యామ్నా యంగా కంది,రాగులు, సజ్జలు, కొర్రలు, ఆముద పంటలు వేయాలన్నారు.
మధ్యాహ్న భోజనం పరిశీలించిన కలెక్టర్
పాలమాకుల ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అన్నం తక్కువగా ఉండటంతో 108 మంది విద్యార్థులకు భోజనం సరిపో తుందా అని నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మెనూ పాటిస్తూ రుచికరంగా వండాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పిస్తూ యాక్టివిటీ బేసిక్స్ ద్వారా పాఠాలు బోధించాలని సూచించారు.
ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోవడం, ఇష్టారీతిన వ్యవహరించడం సరికాదని కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మింగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులకు అందుతున్న బోధనపై ఆరా తీశారు. మధ్యాహ్న సమయంలో ప్రధానోపాధ్యాయుడి అనుమతి లేకుండా, అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయకుండా ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. సదరు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ డీఈవో రమేశ్ను ఫోన్లో ఆదేశించారు.


