ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్భార్గవ్
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రతి ఒక్కరూ నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయ్భార్గవ్, జెడ్పీ సీఈఓ రమేశ్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో బుధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ గ్రామానికి ఊట కుంట నిర్మించి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజన తండాలు, మారుమూల పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
బెజ్జంకి బంద్ విజయవంతం
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం బెజ్జంకిలో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వర్షంలో సైతం జేఏసీ నాయకులు ప్రధాన వీధుల్లో ర్యాలీలు నిర్వహించి ఇథనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. వాణిజ్య, విద్యా సంస్థలు, బ్యాంకులను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీల వలన మండల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని పలుమార్లు విన్నవించి నా అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదన్నారు. 45 రోజులలో ఫ్యాక్టరీల అనుమతులు రద్దు చేయకుంటే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష రాష్ట్రాలకే
అప్పగించాలి: చాడ
హుస్నాబాద్: నీట్ పరీక్షల నిర్వాహణ రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని సీపీఐ భవన్లో బుధవారం ఆ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ జిల్లా కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ... జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్ధులపై జరిగిన లాఠీచార్జీ అమానుషమన్నారు. ‘దేశంలో మార్పు రావాలి. బీజేపీ గద్దె దిగిపోవాలి’అనే నినాదంతో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు పల్లె పల్లెకు సీపీఐ పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఏ మంత్రి పదవి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సీపీఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్, నాయకులు శ్రీనివాస్, కనుకుంట్ల శంకర్, అశోక్, లక్ష్మి, రాములు తదితరులున్నారు.


