‘ఉద్యాన’ వీసీ డాక్టర్ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): కృత్రిమ మేధస్సుతో సాగు రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ రాజిరెడ్డి అన్నారు. న్యూఢిల్లీలోని ఐఎస్ఏఎస్టీఆర్ ఆధ్వర్యంలో జస్ట్ అగ్రికల్చర్ సౌజన్యంతో 2.0 అనే అంశంపై రెండు వారాల పాటు జరిగిన అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కృత్రిమ మేధా ఆధారిత సాగు, సాంకేతికత, స్మార్ట్ నైపుణ్యాలు ప్రస్తుతం లాభసాటి సాగుకు అత్యవసరమని తెలిపారు. వ్యవసాయాన్ని ఉపాధి కాకుండా వ్యాపారంగా చూడాలని, ఆవిష్కరణల ద్వారా సంపద సృష్టించాలని పిలుపునిచ్చారు.
రెండో రోజు ‘టెట్’ ప్రశాంతం
సిద్దిపేటఅర్బన్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) పరీక్ష రెండో రోజు బుధవారం ప్రశాంతంగా కొనసాగింది. పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహించారు. ఉదయం సెషన్కు 50 మందిని కేటాయించగా 36 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్కు 50 మందికి గాను 46 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరయ్యారు.
రేపు ‘గోమాత వైభవం’
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు రాక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని వీఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో ఈ నెల 19న గోమాత వైభవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్దిపేట ఉత్సవ కమిటీ నిర్వాహకులు వైద్య కృష్ణమాచార్యులు, మాంకాల నవీన్కుమార్, గంప శ్రీనులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రావిచెట్టు హనుమాన్ ఆలయ ట్రస్ట్ భవనంలో వారు విలేకరులతో మాట్లాడారు. గోమాత వైభవం కార్యక్రమం ధర్మవర్థిని ట్రస్ట్, సిద్దిపేట ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై, గోమాత విశిష్టను తెలుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు, కలెక్టర్, జిల్లా న్యాయవాది, సీపీ, తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. అందువలన భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
అడ్మిషన్ల జోరు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 154 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలకంటి మనోహర్ తెలిపారు. బుధవారం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ చేశారు. గత సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరం అధిక సంఖ్యలో అడ్మిషన్లు జరుగుతున్నాయని, ప్రధానోపాధ్యాయులు తెలిపారు. అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయం అన్నారు.
చేర్యాల ఎస్బీఐని
సందర్శించిన డీజీఎం
చేర్యాల(సిద్దిపేట): స్థానిక మెయిన్ రోడ్లోని ఎస్బీఐ బ్రాంచీని డీజీఎం సందర్శించారు. బుధవారం బ్రాంచీకి వచ్చిన ఆమె ఖాతాదారులకు అందుతున్న సేవలు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికంగా చర్చనీయాంశంగా మారిన దానంపల్లి మహిళా సంఘాల విషయంపై కూడా బ్రాంచీ మేనేజర్తో ఆరా తీసినట్లు సమాచారం. మహిళా సంఘాల డబ్బుల అవకతవకలపై త్వరగా విచారణ జరిపి నివేదిక రూపొందించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించినట్లు సమాచారం. ఆమె వెంట స్థానిక మేనేజర్ శ్రీలత, ఆర్ఎం, బ్యాంకు సిబ్బంది ఉన్నారు.


