● ఈనెల 28, 29 తేదీల్లో వేసేందుకు చర్యలు ● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన పల్స్ పోలియో సమన్వయ సమావేశంలో కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28, 29 తేదీలలో జిల్లాలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించాలన్నారు. అలాగే ఇంటింటి సర్వే ద్వారా ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఫాగింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిఅందుబాటులో ఉండేలా చూడాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. తడి, పొడి చెత్తను రోడ్లపై వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, జిల్లా వ్యాప్తంగా డ్రై డే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అనంతరం పల్స్ పోలియో కార్యక్రమం, డెంగీ నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


