కలెక్టరేట్ ఎదుట
జీపీ సిబ్బంది ధర్నా
సిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీ కార్మికులకు, సిబ్బందికి ఇబ్బందిగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీపీ కార్మికుల, ఉద్యోగుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెలా 1న వేతనాలు అందించాలన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇబ్బందిగా తయారైన మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు. పంచాయతీ సిబ్బందిని రెండో పీఆర్సీలో గుర్తించాలని, జీవో నంబర్ 51 సవరించి, ప్రమాదం జరిగిన కార్మికులకు నష్టపరిహారం రూ.20 లక్షలతో పాటు, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇళ్లతో పాటు, డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవి కుమార్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమ్ముల బాల్ నర్సయ్య, అండాలు, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.


