జిల్లాలోని మున్సిపాలిటీలను కై వసం చేసుకునేందుకు ప్రధాన
● ముమ్మరంగా ప్రజాభిప్రాయ సేకరణ ● అశావహుల ప్రజాసేవలపైనా ఆరా ● మున్సిపోల్స్పై ప్రధాన పార్టీల ఫోకస్
మున్సిపల్ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటి నుంచే గెలుపు గుర్రాల అన్వేషణలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. ఇందులో భాగంగా ఆశావహులపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీని గతంలో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ విజయం సాధించగా, మూడో సారి ముచ్చటగా కైవసం చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే సతీష్కుమార్ పావులు కదుపుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక చైర్మన్ స్థానాలను గెలుచుకోవాలని పార్టీ నాయకులకు సీరియస్గా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సతీష్కుమార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకారం జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్ధానాల్లో ఎవరెవరు బరిలో ఉంటారో వారి పేర్లను నమోదు చేసుకొని ముందుకు సాగుతున్నారు. మరో వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ మున్సిపాలిటీలో బీజేపీ పాగా వేసేందుకు క్షేత్రస్థాయిలో గెలిచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించారు.
సర్వేల బాట..
మున్సిపల్ పరిధిలో రిజర్వేషన్ ప్రకారం ఆయా కేటగిరిల్లో ఎవరు గెలుస్తారో ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. వార్డుల వారీగా కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వార్డుల్లో తిరిగి ఆశావహులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో వివరాలు సేకరించాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్లో కూడా గెలిచే వ్యక్తులకే టికెట్లు ఇవ్వాలని ఆ దిశగా సర్వే చేయాలని సతీష్కుమార్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. మరో వైపు బండి సంజయ్ వ్యూహాత్మకంగా గెలిచే గుర్రాలపై దృష్టి సారించారు. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడంతో ఈ మూడు పార్టీలు పెద్దగా దృష్టి సారించలేదు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతుండటంతో అన్ని పార్టీలు సవాలుగా తీసుకుంటున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిత్యంలోని హుస్నాబాద్ మున్సిపాలిటీపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఒకరు రాష్ట్ర మంత్రి, ఇంకొకరు కేంద్ర మంత్రి, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఈ ముగ్గురికి మున్సిపల్ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి.
ఓటరు తుది జాబితా విడుదల
హుస్నాబాద్: మున్సిపల్ పరిధిలో ఓటరు తుది జాబితాను సోమవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ విడుదల చేశారు. మొత్తం 20 వార్డులకు గాను 19,227 ఓటర్లు ఉన్నట్లు నిర్ధారించారు. 15వ వార్డులో అత్యధికంగా 1,319 ఓటర్లు, మూడో వార్డులో అత్యల్పంగా 693 ఓటర్లు ఉన్నారు. గతంలో ఎక్కువ ఓట్లు ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్య తగ్గగా, తక్కువ ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.
రిజర్వేషన్లపైనే అందరి దృష్టి
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా వస్తాయోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు మారుతాయా, రొటేషన్ పద్ధతా? లేకుంటే గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? అనేది అన్ని పార్టీల నేతల్లో నెలకొన్న ప్రశ్న. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ సీటు జనరల్ మహిళకు కేటాయించారు. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలిచారు. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మున్సిపల్ పీఠాన్ని కై వసం చేసుకుంది. ఈ సారి బీసీ జనరల్కు కేటాయిస్తారా అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. జనరల్, బీసీలకు కేటాయిస్తే చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనేదానిపై అన్ని పార్టీలకు తలనొప్పిగా మారనుంది. మరో వైపు ఎస్సీకి కేటాయిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే జరిగితే అన్ని పార్టీలకు పెద్ద ఊరట లభించినట్లే.


