
సర్కారు బడి.. సమస్యల ఒడి
● పెచ్చులూడుతున్న గదుల పైకప్పులు ● వరండాలలోనే తరగతులు ● మూత్రశాలలు లేక ఇబ్బందులు ● నిలిచిన ‘మన బడి’ పనులు ● క్షేత్రస్థాయిలో ‘సాక్షి’ పరిశీలన
పెచ్చులూడుతున్న పైకప్పులు.. వర్షాలకు ఉరుస్తున్న గదులు.. వరండాలు, రేకుల షెడ్డుల్లో తరగతులు.. ఇలా అసౌకర్యాల నడుమ బిక్కు బిక్కుమంటూ చదవులు వెళ్లదీస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్ల కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘మన ఊరు– మన బడి’ అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. జిల్లాలో 912 ప్రభుత్వ పాఠశాలలో 65,231 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పలు పాఠశాలలను గురువారం సాక్షి విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగుచూశాయి. – సాక్షి, సిద్దిపేట
ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం మన ఊరు– మన బడి పథకం తీసుకొచ్చింది. అందులో భాగంగా 342 ప్రభుత్వ పాఠశాల్లో అదనపు గదులు, డైనింగ్ హాళ్లు, మూత్రశాలలు రూ.126..07కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 77 పాఠశాలలో పనులు పూర్తి కాగా, 96 పాఠశాలలు 75శాతం పనులు, ఇంకా 169 పాఠశాలలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. డిసెంబర్ 2023 వరకు జరిగిన పనులకు రూ.53.17 కోట్లకు గాను రూ.37.60కోట్లను మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.15.56కోట్లు పెండింగ్ ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో గదుల కొరత, సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.
అసంపూర్తిగా టాయిలెట్స్
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎల్లాయపల్లి ప్రాథమిక పాఠశాలలో బాలికల టాయిలెట్స్ గత ఏడాది నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీంతో బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటిని బాలవికాస వాటర్ ప్లాంట్ నుంచి రోజూ తీసుకువస్తున్నారు. పాఠశాలలో మొత్తం 30 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారు.
ఆరు బయటే మూత్ర విసర్జన
కొమురవెల్లి (సిద్దిపేట): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి సరిపడా టాయిలెట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఆరు బయటే మూత్ర విసర్జనకు వెళ్తున్నారు.
గదులు పెచ్చులూడుతున్నాయ్..
నంగనూరు(సిద్దిపేట): మండల పరిధిలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. వర్షానికి తరగతి గదులు ఉరుస్తున్నాయి. పాఠశాలలో ఏడు గదుల గాను ఐదు గదులు వర్షానికి ఉరుస్తుండటంతో తరగతి గదిల్లోకి నీరు చేరుతుంది. భవనం పెచ్చులూడుతూ కింద పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.
ఒకే గదిలో ఐదు తరగతులు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని లింగుపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. మొత్తం ఐదు తరగతులకు 13 మంది విద్యార్థులకు గాను, గురువారం నలుగురు విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఒకే గదిలో ఐదు తరగతులకు 18 సబ్జెక్టులను ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది.
పొగతో ఉక్కిరిబిక్కిరి
జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల పూర్తిగా శిథిలావస్థలో ఉంది. 30 విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. ఒక గదిలో వరండాలో తరగతులు కొనసాగుతున్నాయి. అలాగే తిగుల్ ప్రాథమిక పాఠశాలలో వంట గది లేక రెండు గదుల మధ్యలో వంటలు చేస్తున్నారు. పొగతో విద్యార్థులు, స్థలం అనువుగా లేకపోవడంతో వంట కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్గల్ మండలం జబ్బాపూర్ పాఠశాలలో వరండాలోనే నిర్వహిస్తున్న రెండేసి తరగతులు
శిథిల భవనంలోనే..
కొండపాక(గజ్వేల్): మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో 110 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థ కు చేరినప్పటికీ గత్యంతరం లేక అక్కడే విద్యా బోధన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ చదువుకుంటున్నారు. విద్యార్థుల తల్లితండ్రులు భయాందోళన చెందుతున్నారు.
నిలిచిన నిర్మాణ పనులు
ములుగు (గజ్వేల్): తునికి బొల్లారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 109 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బడిలో సరిపోను గదులు లేవు. కంప్యూటర్ ల్యాబ్ కోసం లైబ్రరీ గదిని వినియోగిస్తున్నారు. పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మన ఊరు– మన బడి పథకం ద్వారా రూ.1.30కోట్ల నిధులతో రెండు హాళ్లు, 8 గదులతో కూడుకున్న నూతన భవన నిర్మాణం చేపట్టినప్పటికీ రెండేళ్లుగా అసంపూర్తి దశలోనే ఉంది.
విద్యార్థులతోనే పనులు..
జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో.. విద్యార్థులతోనే ఉపాధ్యాయులు పనులు చేయిస్తున్నారు. స్టాఫ్ రూమ్కు వారితోనే మ్యాట్లను అతికిస్తున్నారు. తరగతి గదిలో పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో పనులు చేయిస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. – సాక్షిస్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
విద్యార్థులే కొడుతున్న బడిగంట
సిద్దిపేట రూరల్: చిన్నగుండపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులతోనే బడి గంటను మోగిస్తున్నారు. అలాగే గురువారం పేరెంట్స్ కమిటీ సమావేశం జరగడంతో వేసిన జంకానాలు విద్యార్థులే మోసుకెళ్లడం ‘సాక్షి’ కంటపడింది. దీనిపై హెచ్ఎం రాధపద్మజను వివరణ అడగగా ‘స్కావేంజరే గంట కొడుతుంది. స్కావేంజర్ మరో పని చేస్తుండటంతో టైం అయిందని విద్యార్థి బెల్ కొట్టి ఉండవచ్చు. మేము మీటింగ్లో ఉన్నాం. మరోమారు జరగకుండా చుసుకుంటాం’ అని అన్నారు.
ముక్కు మూసుకోవాల్సిందే
దుబ్బాక టౌన్(దుబ్బాక): పట్టణంలోని డబుల్ బెడ్రూం కాలనీలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాల దుర్ఘంధంతో కంపుకొడుతోంది. పాఠశాలలో 44 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. డబుల్ బెడ్రూంలలో వినియోగించిన నీరు పాఠశాలలోకి వచ్చి చేరుతుంది. పాఠశాల సమీపంలో డ్రైనేజీ సైతం సరిగా లేదు. వర్షం పడితే పై నుంచి నీరంతా వచ్చి తరగతి గదుల్లోకి వస్తుంది. నీటి పైప్లైన్ సరిగా లేక లీక్ అవుతుంది. పాఠశాలలో ఎలుకల బెడదతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
దశల వారీగా పనులు
ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, మూత్రశాలల నిర్మాణాలు దశల వారీగా పనులు జరుగుతున్నాయి. మన ఊరు– మన బడి పనులకు డబ్బుల చెల్లింపు నిలిచిపోగా పనులు మధ్యలో నిలిచిపోయాయి. 8 ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలు కలెక్టర్ మంజూరు చేశారు. ఒక్కో భవనానికి రూ.30లక్షల చొప్పున రూ.2.40కోట్లు మంజూరు అయ్యాయి.
– శ్రీనివాస్ రెడ్డి, డీఈఓ

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి

సర్కారు బడి.. సమస్యల ఒడి