
సంక్షేమ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లండి
మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హరికృష్ణ ఇంట్లో అల్పాహారం అనంతరం పార్టీ శ్రేణులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
పశుగణానికి ‘ట్యాగింగ్’
వర్గల్(గజ్వేల్): నాచగిరి పుణ్యక్షేత్రంలోని గోశాలలో పశుగణానికి పశువైద్యాధికారులు ‘ట్యాగింగ్’ వేశారు. ‘డొక్కలు చిక్కి..బొక్కలు తేలి’ శీర్షికతో నాచగిరి గోశాలలో గోవుల దయనీయ స్థితిని వెల్లడిస్తూ ఈ నెల 9న ‘సాక్షి’ ప్రత్యేక కథనం పుచురించిన విషయం పాఠకులకు విదితమే. ఈ మేరకు ఆలయ యంత్రాంగం, పశువైద్యశాఖ స్పందించి ‘గోశాల’లో గోవుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. వాటికి మేత, దాణా, పోషకాలు పెడుతున్నారు. మరోవైపు గురువారం పశువైద్యాధికారి డాక్టర్ సర్వోత్తం యాదవ్ గోశాలను సందర్శించి పరీక్షలు జరిపారు. ప్రతి పశువుకు ఒక గుర్తింపు నెంబర్ ఇస్తూ ‘ట్యాగింగ్’ చేశారు. ఆ నెంబర్ల ప్రకారం ఆయా పశువుకు సంబంధించి ఆరోగ్య స్థితిగతులు (కేస్ షీట్) నమోదుచేశారు. త్వరలోనే పశువులకు ‘లంప్స్కిన్’ వ్యాక్సిన్ వేస్తామని వైద్యాధికారి తెలిపారు.
ఈ పాస్ మిషన్ ద్వారే
ఎరువులు విక్రయించాలి
జిల్లా వ్యవసాయ అధికారి రాధిక
జగదేవ్పూర్(గజ్వేల్): ఎరువుల దుకాణాల డీలర్లు ఈ పాస్ మిషన్ ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక సూచించారు. గురువారం మండలంలోని మునిగడప, జగదేవ్పూర్ గ్రామాలలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ పాస్ మిషన్లోని ఎరువుల నిల్వలు సమానంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అధిక ధరలకు విక్రయించినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా 3300 ఎంటీ యూరియా, 4600 ఎంటీల ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో సరిపడా వరి, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఈసెట్ కౌన్సెలింగ్
నంగునూరు(సిద్దిపేట): రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన కౌన్సెలింగ్కు 450 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కోసం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లండి

సంక్షేమ పథకాలనుప్రజల్లోకి తీసుకెళ్లండి