
నేను కఠినంగా ఉంటా..
● విధుల్లో నిర్లక్ష్యం సహించను ● అధికారుల తీరుపై కలెక్టర్హైమావతి సీరియస్
హుస్నాబాద్: ‘నేను కఠినంగా ఉంటా.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు’ అని కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. హుస్నాబాద్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాయలంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాం, అడ్మిషన్లు పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలన్నారు.
కాలం చెల్లిన మందులు వాడొద్దు
ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులతో కలెక్టర్ మాట్లాడారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ప్రైవేట్కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయించుకోవాలని సూచించారు. కాలం చెల్లిన మందులు వాడకూడదని సిబ్బందికి సూచించారు.
అభివృద్ధి పనులపై సమీక్ష
మున్సిపల్, పీఆర్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షా నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, కమ్యూనిటీ భవన నిర్మాణాల పెండింగ్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా పనులు ప్రారంభించకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే లీగల్ నోటీస్లు జారీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చట్ట ప్రకారం భూ సమస్యలు పరిష్కారం
కోహెడరూరల్(హుస్నాబాద్): భూ భారతి చట్ట ప్రకారం భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. సముద్రాల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కారించాలని అధికారులకు సూచించారు.
గౌరవెల్లి ప్రాజెక్టు సందర్శన
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని గౌరవెల్లి ప్రాజెక్టును గురువారం కలెక్టర్ హైమావతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాజెక్టు స్థితిగతులు, నిర్మాణ పనులపై ఆరా తీశారు. పనులు ఎందుకు నిలిచాయని నీటిపారుదల శాఖ ఈఈ రామునాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్జీటీలో కేసులు ఉండడంతో చివర దశ పనులు నిలిచాయని రామునాయక్ వివరించారు. ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా గండిపల్లి ప్రాజెక్టు కూడా ఉందని, ఆ ప్రాజెక్టు పనులు త్వరగా జరగాల్సి ఉందని కలెక్టర్ అన్నారు.