
అంతా టెన్షన్.. టెన్షన్
● నేడు దుబ్బాకలో ఇన్చార్జిమంత్రి వివేక్ పర్యటన ● గతంలో మంత్రి కొండా సురేఖపర్యటనలో తీవ్ర ఉద్రిక్తత ● ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ● ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్
దుబ్బాక: ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి శుక్రవారం దుబ్బాకలో మంత్రి వివేక్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అంతటా టెన్షన్ నెలకొంది. గతంలో మంత్రి కొండా సురేఖ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్, ఎంపీ రఘునందన్రావు బీజేపీ, అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ని యోజకవర్గంలో గత ఏడాదిన్నర కాలంగా మూడు పార్టీల మధ్య ఆధిపత్య పోరు చోటుచేసుకుంది. ఏ ప్రభుత్వ కార్యక్రమం చేపట్టాలన్నా మూడు పార్టీలతో అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారైంది. 6 నెలల క్రితం దుబ్బాకలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్పై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య జరిగిన రగడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడం.. మధ్యలోనే మంత్రి వెళ్లిపోవడం అంతా రసాభాసగా మారింది. మళ్లీ మంత్రిగా వివేక్ నియోజకవర్గంలో పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న చర్చ జోరుగు సాగుతోంది.
పోటాపోటీగా ప్రకటనలు
నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు అందించే కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుగనుంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఏవరికి వారు భారీగా తరలిరావాలంటూ ప్రచారం మొదలుపెట్టారు. మంత్రి వివేక్ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తారంటూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఇస్తారంటూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుండగా బీజేపీ నాయకులు సైతం తరలిరావాలంటూ తమ క్యాడర్కు పిలుపు నివ్వడం తీవ్ర చర్చానీయంశంగా మారింది. మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డి ప్రత్యేకంగా క్యాడర్తో సమావేశం పై చర్చించారు.
నేడు మంత్రి పర్యటన ఇలా..
మంత్రి వివేక్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని రజనీకాంత్రెడ్డి గార్డెన్కు చేరుకుంటారు. అక్కడే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈసందర్భంగా జరిగే సమావేశంలో ప్రసగించనున్నారు.
సీపీ అనురాధ ప్రత్యేక దృష్టి
మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా సీపీ అనురాధ దృష్టిసారించారు. అలాగే అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు.

అంతా టెన్షన్.. టెన్షన్