
పామాయిల్ రైతుకు భరోసా
రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ పరిశ్రమ
సాక్షి, సిద్దిపేట: ఆయిల్ గెలల నుంచి ముడి నూనె తీయడంతోపాటు శుద్ధి చేసిన తరువాత ఆయిల్ ప్యాకెట్స్ రూపంలో త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఉండగా తాజాగా మూడోది తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని నంగనూరు మండలం నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల్లో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ జూన్ చివరి వరకు అందుబాటులోకి రానుంది.
సాగుకు అనుగుణంగా ఫ్యాక్టరీ..
ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోంది. దీనిని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్లను సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ ఫామ్లను ఎక్కువగా సాగు చేసేవారు. ప్రస్తుతం 31 జిల్లాల్లో 64,325 మంది రైతులు 2,42,627 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో సిద్దిపేటలో పామాయిల్ ఫ్యాక్టరీకి 2023లో శంకుస్థాపన చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి.
అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు
అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు కాబోతున్న ఫ్యాక్టరీలో గంటకు 30టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ప్రారంభించనున్నారు. ఆయిల్ ఫామ్ గింజల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యంను గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలి ఫ్యాక్టరీ ఇది.
వ్యర్థాలతో విద్యుత్
ఆయిల్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్తో ఆధునిక టర్బైన్లతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక్క యూనిట్కు రూ1.5 ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది.
కాలుష్య రహితంగా..
కాలుష్య రహితంగా ఉండేవిధంగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీ యూజ్ చేసే విధంగా ప్రణాళికను రూపొందించారు. దీంతో భూగర్భజలాలు అంతరించిపోకుండా ఉంటాయి. నిరుద్యోగుల ఉపాధి కల్పనకు ఈ పరిశ్రమ దోహదపడనుంది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీ నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిశీలించారు.
గెలల వ్యర్థాలతో
4 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్
సిద్దిపేట జిల్లా నర్మెటలో
62 ఎకరాల్లో..
రూ. 300 కోట్లతో నిర్మాణం
64వేల మంది రైతులు
2.42 లక్షల్లో సాగు
జూన్ చివరికి అందుబాటులోకి
ఇక్కడే రిఫైన్డ్
ప్రస్తుతం అశ్వారావుపేటలో గంటకు 30 టన్నులు, అప్పారావురావుపేటలో 90టన్నుల సామర్థ్యంతో పరిశ్రమలున్నాయి. వీటి నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ను హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ఆయిల్ ఫెడ్కు పంపి అక్కడ రిఫైన్డ్ చేసి ప్యాకింగ్లో మార్కెట్లోకి పంపించేవారు. సిద్దిపేటలో ఏర్పాటు అవుతున్న ఫ్యాక్టరీలో గెలల నుంచి వచ్చే క్రూడ్ పామాయిల్ను తీసి అక్కడే రిఫైన్డ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపుతారు. ఇక్కడ గంటకు 250 టన్నుల పామాయిల్ను ప్యాకింగ్ చేయనున్నారు.
జూన్ చివరికి అందుబాటులోకి..
సిద్దిపేటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ జూన్ చివరి వరకు అందుబాటులోకి వచ్చేలా పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని జిల్లాలకు దగ్గరగా ఈ పరిశ్రమ ఉండటంతో రైతులకు ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఉన్న రెండు పరిశ్రమలలో టన్నుకు 19.4శాతం ఆయిల్ వస్తుంది. ఆయిల్ శాతం పెరిగితే రైతుకు మరింత ఆదాయం పెరగనుంది.
– సుధాకర్ రెడ్డి, జీఎం,
తెలంగాణ ఆయిల్ ఫెడ్

పామాయిల్ రైతుకు భరోసా

పామాయిల్ రైతుకు భరోసా