
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం
కొండపాక(గజ్వేల్): పేదలు కడుపు నిండా అన్నం తినేలా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని చేపట్టిందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో రేషన్కార్డు ద్వారా సన్న బియ్యం పొందిన లబ్ధిదారుడి ఇంట్లో శుక్రవారం భోజనం చేశారు. సన్న బియ్యం పథకం ఎలా ఉందంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా రేషన్ దుకాణాల ద్వారా 5,775 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. కాయ కష్టం చేసే పేదలు కడుపు నిండా ఆహారం తీసుకునేలా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడంలో డీలర్లు అలసత్వం చూపితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సన్న బియ్యం పంపిణీ దోహదపడుతుందన్నారు. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారుడి కుటుంబీకులు తలపాన శ్రీనివాస్, పుష్ప, అదనపు కలెక్టర్ హమీద్, డీఎస్ఓ తనూజ, డీపీఓ దేవకీదేవి, తహసీల్దార్ దిలీఫ్ నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మనుచౌదరి లబ్ధిదారుడి ఇంట్లో భోజనం