
గొప్ప దార్శనికుడు పూలే
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
సిద్దిపేటజోన్: సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనులకు దశదిశగా నిలిచిన దార్శనికుడు జ్యోతిరావు పూలే అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పూలే విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన సేవలను సమాజానికి తెలపాలని సూచించారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అదనపు కలెక్టర్ హమీద్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాజమ్మ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వర్మ, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. పూలే జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ రఘునందన్ రావు ఫొటో లేదని, ప్రొటోకాల్ ఉల్లంఘన అంటూ బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.