
అన్నదాత.. గుండె కోత
బాధిత రైతులను ఆదుకోండి
ఎమ్మెల్యే హరీశ్రావు
సిద్దిపేటజోన్: పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. గురువారం కలెక్టర్ మనుచౌదరి, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, వరి, మామిడి పంట లను అకాల వర్షం తీవ్రంగా నష్టపరిచిందన్నారు. వ్య వసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
●వడగళ్ల బీభత్సం ●ఆరు నెలల కష్టం వర్షార్పణం
●వేల ఎకరాల్లో పంట నష్టం
ఇంటిల్లిపాది రెక్కల కష్టం వర్షార్పణమైంది. పంట చేతికొచ్చే తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వాన అన్నదాతను నిండా ముంచింది. ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో నష్టం జరిగిందని రైతులు వాపోయారు. నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలుల ధాటికి కొన్ని గ్రామాల్లో చెట్లు నేలకూలగా, వడగళ్ల వానకు మామిడి కాయలు సైతం నేలరాలాయి. అలాగే మొక్కజొన్న, మిర్చి, టమాటా, కూరగాయ పంటలు నేలకొరిగాయి. నంగునూరు మండలంలోని 11 గ్రామాల్లో 3,869 ఎకరాలు, చిన్నకోడూరు మండలంలో 2,100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఏడీఏ పద్మ, ఏఓ గీత తెలిపారు. – నంగునూరు/చిన్నకోడూరు(సిద్దిపేట)
30 ఏళ్లలో ఎన్నడూ చూడలే
రెండు ఎకరాల్లో వరి పంట కోసి ఐకేపీ సెంటర్కు తెచ్చి ఆరబెట్టాను. రాత్రి కురిసిన వడగళ్ల దెబ్బకు వడ్లన్నీ బియ్యంగా మారాయి. ఇంత రాళ్లవాన, నష్టం 30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు.
– చంద్రయ్య, రైతు, పాలమాకుల

అన్నదాత.. గుండె కోత

అన్నదాత.. గుండె కోత