పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్
కొండపాక(గజ్వేల్): నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు చాలా కీలకమని పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్ అన్నారు. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో మంద భూదవ్వ–లక్ష్మారెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు నిఘా నీడలో ఉండేందుకు గాను ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ బావులు, దుకాణాలు, హోటళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయని, కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. అనంతరం దాతను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్రెడ్డి, ఏసీపీ నర్సింహారెడ్డి, సీఐ లక్ష్మీబాబు, నాయకులు తోటకూరి మల్లేశం, రాములు, మల్లేశం, రాజు తదితరులు పాల్గొన్నారు.
వంద మంది పోలీసులతో సమానం
చేర్యాల(సిద్దిపేట): ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అదనపు డీసీపీ కుశాల్కర్ అన్నారు. మండల పరిధిలోని కడవేర్గు గ్రామంలో సర్పంచ్ తాళ్లపల్లి రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు ఈ కెమెరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలు తాళ్లపల్లి నర్సయ్య, పొన్నం దాసు, కోడూరి సత్యనారాయణను సత్కరించారు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్ఐ అపూర్వరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజు, ఉపసర్పంచ్ సురేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కర్కపట్ల గ్రామంలో..
మర్కూక్(గజ్వేల్): నిఘా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండలంలోని కర్కపట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకోసం ప్రతిగ్రామంలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు. సర్పంచ్ కవిత, ఉపసర్పంచ్ అన్వర్ పాషా, సుగుణాకర్రెడ్డి, బాలకృష్ణ, సీఐ రవిరాజు, ఎస్ఐ యూనస్ హైమద్అలీ పాల్గొన్నారు.


