సిద్దిపేటకమాన్: జిల్లా జైలులోని ఖైదీలకు టీబీఎంబీఏ కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సిద్దిపేట యూనిట్ టీబీ సూపర్వైజర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఖైదీలకు టీబీ వ్యాధి నిర్థారణ కోసం ఎక్స్రే, ఇతర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో క్షయ నివారణ అధికారి డాక్టర్ నిర్మలరెడ్డి, టీబీ యూనిట్ సిబ్బంది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): గుండెజబ్బుతో బాధపడుతూ 13 ఏళ్ల బాలిక చిన్న వయసులోనే కన్నుమూసింది. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోతారబోయిన నిషిత అలియాస్ నిచ్చు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గత వారం రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన నిషితను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. గుండెజబ్బు అని తేలడంతో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు ఇంటికి తీసుకురాగా, అక్కడే శ్వాస విడిచింది. చిన్న వయసులోనే గుండెజబ్బుతో మరణించడంతో ఆ తల్లిదండ్రులు, బంధువుల రోదనలు చూసి గ్రా మస్తులు కంటతడి పెట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో కట్కూ ర్ను తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ నిరుపేద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సర్పంచ్ కొడముంజ బాలరాజు, గ్రామస్తులు కోరుతున్నారు.
పాపన్నపేట(మెదక్): ప్రేమ పెళ్లి చేసుకున్న వివాహితను అత్తవారింటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలోని ఎల్లాపూర్కు చెందిన యువకుడు కౌడిపల్లి మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకొని ఈనెల 6న పాపన్నపేట పోలీస్స్టేషన్కు వెళ్లారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం సదరు యువకుడు తన భార్యను తీసు కొని తన స్వగ్రామమైన ఎల్లాపూర్కు వెళ్లాడు. బుధవారం యువతి కుటుంబ సభ్యులు ఎల్లాపూర్ వచ్చి యువతిని బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఈమేరకు సదరు యువకుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, మెదక్ సీఐ కార్యాలయంలో కొత్త జంటకు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం యువతి ఇష్టం మేరకు ఆమెను భర్తతో పంపించారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ఓవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు మద్యానికి బానిసైన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం స్థానిక ఎస్ఐ అమరేందర్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని పాంపల్లి గ్రామానికి చెందిన గాదె రాములు(50), భార్య, పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. బుధవారం రాములు ఇంటివద్ద ఒక్కడే ఉన్నాడు. భార్య భాగమ్మ పొలం పనులకు వెళ్లి రాత్రికి వచ్చింది. ఇంటి తలుపులు పెట్టి ఉండటంతో ఇంట్లో ఉన్న రాములును ఎంత పిలిచిన తలుపు తీయక పోవడంతో పగలగొట్టి చూసేసరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
పటాన్చెరు: అమీన్పూర్ పట్టణంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నారాయణ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్లు, ఇతర మౌలిక వసతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. వివిధ కాలనీలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. పౌరులకు ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
రామచంద్రాపురం(పటాన్చెరు): స్థానిక డివిజన్లో బుధవారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మాంసం మార్కెట్ పనులను పరిశీలించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.


