పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి

Jun 23 2026 7:55 AM | Updated on Jun 23 2026 7:55 AM

ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు రేషన్‌ డీలర్ల వినతి

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

ప్రభాకర్‌, మాణిక్‌రావు

పటాన్‌చెరు: అమీన్‌పూర్‌ సర్కిల్‌ పరిధిలోని సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైస్‌ పార్కులో ఉన్న పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాల కల్పనలో తొలి ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పరిశ్రమల యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. సోమ వారం సుల్తాన్‌ పూర్‌ మెడికల్‌ డివైస్‌ పార్కులో గల ఐలా కార్యాలయంలో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు, ఐలా అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం 120 పరిశ్రమలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రతి పరిశ్రమ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రిక్రూట్‌మెంట్‌ సమయంలో స్థానికులకు సమాచారం అందించాలని కోరారు. దీంతో పాటు ప్రజా కార్యక్రమాలకు సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించాలన్నారు. జులై మొదటి వారంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సుధాకర్‌ రెడ్డి, ఐలా కమిషనర్‌ శ్రీనివాస్‌, డీఈ సురేందర్‌, విద్యుత్‌ శాఖ ఏడీ సంజయ్‌, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

నియోజకవర్గాల సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డి: సంగారెడ్డి, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్‌, మాణిక్‌రావు జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌న్‌ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, రైతు సమస్యలు, తాగునీటి సౌకర్యం, రోడ్లు, విద్యా సంస్థలు, గ్రామీణ మౌలిక వసతులు తదితర అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రూ.5 కోట్లతో నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, నాలుగు మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కంది మండలం ఉత్తర్‌పల్లి గ్రామ పరిధిలో రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గిర్మాపూర్‌ గ్రామంలో త్రిపుల్‌ ఆర్‌ భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో బయోమెట్రిక్‌ విధానాన్ని సడలించాలని ఎమ్మెల్యే కోరారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

గోదాంలో ‘వే బ్రిడ్జి’ ఏర్పాటు చేయండి

సంగారెడ్డి: సివిల్‌ సప్లై గోదాంలో తక్షణమే వే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు సోమవారం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గోదాంలో వే బ్రిడ్జి లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను రేషన్‌ డీలర్లు ఇటీవల కాంగ్రెస్‌ నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించారు. టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంతకిషన్‌ ఆధ్వర్యంలో రేషన్‌ డీలర్ల ప్రతినిధి బృందం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి సివిల్‌ సప్లై గోదాంలో వే బ్రిడ్జి కావాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రేషన్‌ డీలర్ల సంఘం కంది మండల అధ్యక్షుడు శంకర్‌, ప్రతినిధులు శశికాంత్‌, యూసుఫ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement