జోగిపేట/వట్పల్లి(అందోల్): అత్యధికంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ పేర్కొన్నారు. జోగిపేట, వట్పల్లి పోలీస్ స్టేషన్లను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పెండింగ్ కేసులను, నేరస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. పరిసరాలలో మొక్కలను నాటారు. వట్పల్లి పోలీస్ స్టేషన్ భవనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పరితోశ్ పంకజ్ మాట్లాడుతూ..పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, వారి సమస్యను పరిష్కరిస్తామన్న భరోసాను కల్పించాలన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహనను పెంచాలని, దాబాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా యజమానులకు సూచించాలని చెప్పారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచిస్తూ, హెల్మెట్ ధరించని సిబ్బందిని విధుల్లోకి అనుమతించకూడదని ఆదేశించారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, వట్పల్లి ఎస్సై శ్రీహరి, జోగిపేట్ ఎస్సై శ్రీకాంత్తోపాటు సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్
జోగిపేట, వట్పల్లి పోలీస్ స్టేషన్లఆకస్మిక తనిఖీ


