విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

సంగారెడ్డి టౌన్‌: విద్యుత్‌ షాక్‌తో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌ మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రూరల్‌ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం... సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామానికి చెందిన తలారి రంజిత్‌ కుమార్‌(34) ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం గ్రామానికి చెందిన గౌండ్ల భర్తయ్య పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజ్‌ పోయిందని సమాచారం అందడంతో వెళ్లాడు. ఈ క్రమంలో ఫ్యూజ్‌ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు కుడి చేయి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధి నిర్వహణలో ఉండగానే జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.

కంది మండలంలో యువకుడు..

కంది(సంగారెడ్డి): విద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండల కేంద్రమైన కందిలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం... పట్టణంలోని లక్ష్మీనగర్‌కు చెందిన మహమ్మద్‌ ఆరిఫ్‌ (23) శనివారం మోటారు ఆన్‌ చేసి నీటితో వాకిలిని శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో పని పూర్తయ్యాక మోటారు నుంచి వైరును తీస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అందరితో కలిసి మెలిసి ఉండే ఆరిఫ్‌ మృతి చెందడం అందరిని కలచివేసింది. లక్ష్మీనగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement