విక్రయాలు లేక మార్కెట్లో మురుగుతున్న పండ్లు
జహీరాబాద్: ఫలాల్లో రారాజుగా చెప్పుకునే మామిడికి డిమాండ్ తగ్గింది. ఒక వైపు ప్రకృతి సహకరించక పోవడం, పండ్లలో నాణ్యత కొరవడంతో ఇతర దేశాల్లో డిమాండ్ లేక పోవడం, మరో వైపు ఇరాన్ యుద్ధ ప్రభావం మామిడి పండ్లపై పడింది. జహీరాబాద్ డివిజన్ పరిధిలో సుమారు 20వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. జహీరాబాద్ పండ్ల మార్కెట్కు నిత్యం 20 నుంచి 25 టన్నుల మేర తోటలను కొనుగోలు చేసిన వ్యాపారులు పండ్లను అమ్మకానికి తెస్తున్నారు. పెద్ద వ్యాపారులు మాత్రం హైదరాబాద్కు తరలిస్తున్నారు. పలు కారణాల చేత ప్రజలు మామిడి పండ్లను తినేందుకు అంతగా ఆసక్తి చూపక పోవడంతో చిల్లవ వ్యాపారాలు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. దీంతో మార్కెట్కు విక్రయం నిమిత్తం తీసుకువస్తున్న పండ్లు పూర్తి స్థాయిలో విక్రయాలు జరగక మిగిలి పోవడంతో అక్కడే మురిగి పోతున్నాయి. దీంతో వ్యాపారులకు నష్టాలు తప్పడం లేదు.
ఎగుమతులపై యుద్ధ ప్రభావం
ఇరాన్ యుద్ధం ప్రభావం మామిడి ఉత్పత్తులపై పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అలాగే.. నాణ్యవంతమైన పండ్లు రాక పోవడం, రసాయనిక మందులను మామిడి పంటలపై పిచికారి చేయడం, పండ్లలో పురుగులు కావడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మామిడి ఉత్పత్తులు జపాన్, లండన్, అమెరికా, సౌదీ, దుబాయ్ తదితర దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడం కూడా ధరలు పడిపోవడానికి కారణంగా పేర్కొంటున్నారు.
మల్చల్మ, శేఖాపూర్, డప్పూర్ తదితర గ్రామాల్లోని రైతుల వద్ద మామిడి తోటలను కొనుగోలు చేసుకుని నగదు డబ్బులు చెల్లించా. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పండ్లకు ఆశించిన మేర డిమాండ్ లేదు. పండ్లు కొనే వారు కరువయ్యారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కూడా నేల రాలింది. ఇలా పలు కారణాలతో రూ.5లక్షల మేర నష్టపోయాను. వ్యాపారం చేయాలంటేనే భయమేస్తోంది.
–సయ్యద్అలీ, వ్యాపారి, శేఖాపూర్
మార్కెట్లో పరిమితంగా అమ్మకాలు జరుగుతున్నాయి. పరిసర మండలాల నుంచి వ్యాపారులు ప్రతి నిత్యం 20 టన్నుల వరకు మామిడి పండ్లు అమ్మకానికి తెస్తున్నారు. పండ్లను తినేందుకు ప్రజలు ఆసక్తి చూపక పోవడం వల్ల పూర్తి స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో మిగిలి పోతున్నాయి. ఇతర దేశాలకు కూడా ఎగుమతులు జరగడం లేదు. ఫలితంగా ధరలు పడిపోయి వ్యాపారులు నష్టపోతున్నారు.
– యూసుఫ్ షరీఫ్, ఫ్రూట్ అసోసియేషన్ అధ్యక్షుడు, జహీరాబాద్
ఎగుమతులు లేక కష్టాల్లో వ్యాపారులు
సహకరించని వాతావరణం
యుద్ధ ప్రభావం కూడా ఒక కారణం
తీవ్ర నష్టాల్లో వ్యాపారులు


