డెకరేషన్‌ సామగ్రి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

డెకరేషన్‌ సామగ్రి దగ్ధం

Jun 12 2026 7:25 AM | Updated on Jun 12 2026 7:25 AM

మద్దూరు(హుస్నాబాద్‌): ప్రమాదవశాత్తు నిప్పంటుకొని డెకరేషన్‌ సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామంలోని తాజ్‌మహల్‌ గార్డెన్‌ఫంక్షన్‌హాల్‌ పక్కనే ఉన్న పొలంలో వరికొయ్యలకు రైతు నిప్పు పెట్టగా వరి కొయ్యలతో పాటు ఫంక్షన్‌హాల్‌ వద్ద నిల్వ చేసిన సుమారు రూ.9లక్షల డెకరేషన్‌ సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. అదేవిధంగా మరో రైతుకు చెందిన పైపులు, విద్యుత్‌వైర్లు కాలిపోయాయి. డెకరేషన్‌ సామగ్రి దగ్ధమవడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు.

అత్యాచార నిందితునికి జైలు

చిన్నకోడూరు(సిద్దిపేట): వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్లు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జయప్రసాద్‌ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. మండల పరిధిలోని అనంతసాగర్‌కు చెందిన వివాహిత ఇంట్లోకి 2020 అక్టోబర్‌ 9న అదే గ్రామానికి చెందిన మెదుల బాల్‌రాజు(40) చొరబడ్డారు. ఆమైపె అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిన్నకోడూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరికి గాయాలు

వెల్దుర్తి(తూప్రాన్‌): మండలంలోని ఎల్కపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాతెల్లి నవీన్‌, కానికె రమేశ్‌ బైక్‌పై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు గుంతలమయమైన రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఇరువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెల్దుర్తిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

శివ్వంపేట(నర్సాపూర్‌): అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధి లింగోజిగూడ వద్ద తండాకు చెందిన పాండు తక్కువ ధరకు వివిధ ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఎనిమిది సంచుల రేషన్‌ బియ్యం ఆటోలో తరలిస్తుండగా గురువారం పట్టుకున్నట్లు చెప్పారు. సేకరించిన బియ్యాన్ని ఇటుక బట్టిల కూలీలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆటోతో పాటు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించి సివిల్‌ సంప్లయ్‌ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

మద్దూరు(హుస్నాబాద్‌): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మద్దూరు ఎస్‌ఐ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈనెల 10న మండలంలోని వల్లంపట్ల గ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. గాగ్గిళ్లాపూర్‌కు చెందిన మాచర్ల చరణ్‌ పాటు వల్లంపట్ల గ్రామానికి చెందిన ఓ మైనర్‌ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని తనిఖీ చేసినట్లు తెలిపారు. వారి వద్ద 51 గ్రాముల గంజాయి, రెండు మొబైల్‌ ఫోన్లు, స్కూటీ, రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై మాదకద్రవ్యాల చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement