తూప్రాన్: తమ భూమిని అక్రమంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఓ దళిత కుటుంబం గ్రామ పంచాయతీ ఎదుట దీక్ష చేపట్టింది. ఈ సంఘటన మండలంలోని ఘనపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఏడేల్లి చిన్న బాలయ్య పేర 30 ఏళ్ల నుంచి సర్వే నం. 157లో 2 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. బాలయ్య మృతి చెందడంతో ఆయన పెద్ద కుమారుడు మైసయ్య, చిన్న కుమారుడు దుర్గయ్యలకు రెండు భాగాలుగా చేసుకున్నారు. కాగా మైసయ్య వద్ద అదే గ్రామానికి చెందిన నర్సయ్య 1995లో సాదా బైనామా చేసుకొని కొనుగోలు చేశాడు. కొన్నేళ్ల క్రితం మైసయ్య మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మైసయ్య భార్య సువర్ణ పేరు మీద చేయించి, తిరిగి ఆమెకు కొంత డబ్బు చెల్లించి భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా ఆ భూమిని సర్వే చేయించే క్రమంలో సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన నర్సయ్య ఆశ్చర్యానికి గురయ్యాడు. తనకు తెలియకుండా తాను సాగు చేస్తున్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేదు. దీంతో ఆదివారం బాధిత కుటుంబం గ్రామ పంచాయతీ ఎదుట టెంటు వేసుకొని తమకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టారు.
గ్రామ పంచాయతీ ఎదుట
బాధితుల నిరసన దీక్ష


